గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (00:27 IST)

మిత్రధర్మానికి గండి కొడుతున్న టీడీపీ: తొలి ఝలక్ ఇచ్చిన బీజేపీ

తాము ఎన్నిసార్లు భంగపడినా, ఎంత తగ్గి మాట్లాడినా, ఎంత సాన్నిహిత్యంగా ఉండాలని ప్రయత్నించినా కనీసంగా మిత్ర ధర్మం పాటించని తెలుగుదేశం పార్టీకి బీజేపీ గుంటూరు జిల్లా శాఖ నేతలు దిమ్మెరపోయే షాక్ ఇచ్చారు. త్

తాము ఎన్నిసార్లు భంగపడినా, ఎంత తగ్గి మాట్లాడినా, ఎంత సాన్నిహిత్యంగా ఉండాలని ప్రయత్నించినా కనీసంగా మిత్ర ధర్మం పాటించని తెలుగుదేశం పార్టీకి బీజేపీ గుంటూరు జిల్లా శాఖ నేతలు  దిమ్మెరపోయే షాక్ ఇచ్చారు. త్వరలో జరగబోయే గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో అన్నిచోట్లా పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించడం టీడీపీని ఖంగు తినిపించింది. ఈ హఠాత్‌ పరిణామంతో కంగుతిన్న తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం ఆలోచనలో పడటంతో గుంటూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 
రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లకు అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా టీడీపీకి దెబ్బ కొట్టాలని బీజేపీ ముఖ్యశ్రేణులు నిర్ణయించాయి. ఎన్నికల్లో తాము అన్ని డివిజన్ల నుంచి పోటీ చేస్తామని బీజేపీ నగర అధ్యక్షుడు ప్రకటించడంతో అధికార పార్టీలో అంతర్మథనం మొదలైంది. వాస్తవానికి చిన్నపాటి నామినేటెడ్‌ పదవి మొదలుకుని ప్రతి విషయంలో టీడీపీ నాయకత్వం బీజేపీ శ్రేణుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రస్థాయి నామినేట్‌ పదవులు మొదలుకుని గత వారంలో ప్రకటించిన గుంటూరు మార్కెట్‌ యార్డు పాలకవర్గం పదవుల వరకూ ఒక్కదాంట్లో కూడా బీజేపీకి ప్రాధాన్యం దక్కలేదు.  
 
మిత్రధర్మం ప్రకారం నామినేటెడ్‌ పదవుల్లో బీజేపీ శ్రేణులకు కొంతమేర ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే, అధికార పార్టీ దీన్ని పూర్తిగా విస్మరించింది. దీంతో బీజేపీ జిల్లా, నగర స్థాయి నేతలు రగిలిపోతూ ఎప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, రాష్ట్రస్థాయి ముఖ్యనేతలు ఈ ఫిర్యాదులపై  ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూ అసంతప్తి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా గతనెల 29న పది రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌లకు చైర్మన్‌లతో పాటు 100 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
వీటిలో రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, హస్తకళల అభివద్ధి సంస్థ, కనీస వేతనాల సిఫార్సు కమిటీ, విజయవాడ, అన్నవరం దేవస్థానాలతోపాటు వివిధ కార్పొరేషన్‌లు ఉన్నాయి. అయితే, బీజేపీ శ్రేణులకు దేవస్థానాల్లో మినహా మరే నామినేటెడ్‌ పోస్టుల్లోనూ ప్రాధాన్యం కల్పించలేదు. దేవస్థానంలో కూడా పదిమంది సభ్యుల్లో ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తున్నారు. ఈ పరిణామాలపై బీజేపీ నేతలు విసిగిపోయారు. గతవారంలో ప్రకటించిన గుంటూరు మార్కెట్‌ యార్డు కమిటీ విషయంలోనూ ఇదే పునరావృతమైంది.
 
ఆసియాలోనే అతిపెద్ద రెండో యార్డుగా పేరున్న క్రమంలో తమకు పాలకవర్గంలో చోటు కల్పించాలని బీజేపీ నేతలు పలుమార్లు టీడీపీ నేతలను కోరగా, తప్పనిసరిగా చోటు కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు. అయితే, ఇచ్చిన మాట తప్పారు. దీంతో బీజేపీ నేతలు యార్డు వ్యవహారంపై కూడా కంభంపాటి హరిబాబుకు ఫిర్యాదు చేశారు. మైత్రిధర్మం పాటించని టీడీపీ వైఖరిపై ఎప్పటినుంచో గుర్రుగా ఉన్న బీజేపీ గుంటూరు నేతలు చివరికి పెద్ద షాకే ఇచ్చారు. 
 
రాజధాని ప్రాంత జిల్లాగా పేరొందిన గుంటూరులో బీజేపీ తిరుగుబాటుతో జరిగే పరిణామాలను తల్చుకుని టీడీపీ జిల్లా విభాకం గజగజలాడుతోంది. అధిష్టానం సత్వరం ఉపశమన చర్య పాటించకపోతే గుంటూరు జిల్లా టీడీపీనుంచి జారిపోయే ప్రమాదం ఉంది.