శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: సోమవారం, 27 ఏప్రియల్ 2015 (09:54 IST)

శివాజీ వళ్లు దగ్గర పెట్టుకో...! బీజేపీ హెచ్చరిక

శివాజీ.. మా పార్టీ నాయకులను విమర్శిస్తున్నావ్... నీకు బుద్ధి పుట్టినట్లు మాట్లాడితే ఊరుకోం.. వళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించుకో.. అంటూ బీజేపీ కార్యకర్తలు తూర్పు గోదావరి జిల్లాలో నటుడు శివాజీకి షాకిచ్చారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న శివాజీ ఆదివారం తూర్పుగోదవరి జిల్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. 
 
ఆయన బీజేపీ నేతలను తరచూ విమర్శిస్తున్నారని, వెంకయ్య నాయుడు, సోము వీర్రాజులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివాజీ, బీజేపీ నేతల వాగ్వాదం జరిగింది. శివాజీ అక్కడ నుంచి హోటల్కు వెళ్లగా బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని వ్యతిరేక నినాదాలు చేశారు. హోటల్ నుంచి ఆయన బయటకు రావాలని డిమాండ్ చేశారు. శివాజీ బీజేపీ అగ్రనేతలను విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 
 
ఆయన బీజేపీ అగ్రనేతలపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  హోటల్ నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించిన శివాజీ బీజేపీ నేతల గురించి తానేం మాట్లాడానని ప్రశ్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని బీజేపీ కార్యకర్తలను శాంతింపజేశారు. శివాజీని వేరే మార్గం ద్వారా అక్కడి నుంచి పంపించి వేశారు.