శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (17:03 IST)

ఏపీ సీఎం చంద్రబాబు జైలుకెళ్లడం తథ్యం : బొత్స జోస్యం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడం తథ్యమని పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కొనసాగడం లేదని, కేవలం రాజకీయ వ్యాపారమే సాగుతోందని విమర్శించారు. 
 
ముఖ్యంగా.. జపాన్, సింగపూర్‌ పర్యటనలకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరెవరితో మాట్లాడారో పరిశీలిస్తే, అసలైన నిజాలు వెలుగులోకి వస్తాయని, అప్పుడు ఆయన జైలుకు వెళ్లక తప్పదన్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు గతంలోనే వచ్చాయని, వాటిపై విచారణ జరగకుండా ఆయన స్టే తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. 
 
ఏపీ రాజధాని నిర్మాణంలో ఏమాత్రం పారదర్శకత లేదని విమర్శించారు. చంద్రబాబుపై విచారణ చేపట్టాలని... అప్పుడు ఆయన చేసిన దందాలు, వ్యాపారాలన్నీ బయటకు వస్తాయని అన్నారు. భూముల సేకరణ విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని బొత్స చెప్పుకొచ్చారు.