శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (08:53 IST)

మదనపల్లెలో దొంగల ముఠా అరెస్టు : 263 గ్రాముల నగలు స్వాధీనం

మదనపల్లె, వాల్మీకిపురంలో తచ్చాడుతున్న దొంగల ముఠాను ప్రత్యేక ఐడీ పార్టీ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి రూ.7.2 లక్షల విలువ చేసే 263 గ్రాముల బంగారు, 200 గ్రాముల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు.
 
ఈ విషయమై డీఎస్పీ కే.రాఘవరెడ్డి, సీఐ గంగయ్య విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి మండలం పోడలపల్లెకు చెందిన శంకారపు వెంకటేష్ (30), కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా కఠారుముద్దలపల్లెకు చెందిన మామకుంట్ల మంజునాథ్(34), గాలివీడు మండలం బలిజపల్లె పంచాయతీ తూముకుంటకు చెందిన గంగరాజు విశ్వనాథ్ (32)లు మగ్గాలు నేసుకుంటూ బ్రతికేవారు. ఈ ముగ్గురు మరో ముగ్గురితో కలిసి ఆ ప్రాంతంలో చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. 
 
దీంతో డీఎస్పీ ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. ప్రత్యేక బృందం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా చోరీ చేసిన నగలను బెంగళూరులో విక్రయించేందుకు వెళుతూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు వారి వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు.