శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 10 జూన్ 2017 (02:54 IST)

ఎటీఎం ఇవ్వదు.. బ్యాంకులోంచి రాదు.. చార్జీల మోత భయంతో బ్యాంకుల్లో డబ్బు ఖాళీ

బ్యాంకుల్లో డబ్బులు జమ చేసినా, డ్రా చేసినా కూడా చార్జీల మోత మోగిపోతుందనే ప్రచార భయంతో డబ్బులు డ్రా చేసుకునేందుకే తప్ప.. జమ చేసేందుకు వచ్చే ఖాతాదారుల సంఖ్య సగానికిపైగా తగ్గిపోయిందని బ్యాంకులు చెబుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని బ్యాంకులు నిజంగానే ఒట్టిప

ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణకు ఇప్పుడు డబ్బు జబ్బు చేసింది. డబ్బు జబ్బు అంటే వాడుకలో ఉండే ధన వ్యామోహం, కండూతి అని కాదు. రాష్ట్రం మొత్తం మీద డబ్బు అందుబాటులో లేదని అర్థం. 80 శాతానికి పైగా ఏటీఎంలు పనిచేయటం లేదు. నేరుగా బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవాలనుకున్నా.. నగదు లేదనే సమాధానమే వినిపిస్తోంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. బ్యాంకుల్లో డబ్బులు జమ చేసినా, డ్రా చేసినా కూడా చార్జీల మోత మోగిపోతుందనే ప్రచార భయంతో 
డబ్బులు డ్రా చేసుకునేందుకే తప్ప.. జమ చేసేందుకు వచ్చే ఖాతాదారుల సంఖ్య సగానికిపైగా తగ్గిపోయిందని బ్యాంకులు చెబుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని బ్యాంకులు నిజంగానే ఒట్టిపోయాయి. 
 
'నాకు అత్యవసరంగా లక్ష రూపాయలు కావాలి. ఆస్పత్రిలో బిల్లు కట్టాల్సి ఉంది. బ్యాంకులో ఏడాది కింద రూ. లక్షన్నర ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాను. ఇదిగో బాండ్‌ కూడా తెచ్చాను. డబ్బులివ్వండి..’ అని ఒక ఖాతాదారుడు డబ్బులకోసం బ్యాంకుకు వెళ్లి ప్రాధేయపడితే ఆ బ్రాంచి సిబ్బంది తమ వద్ద అంత డబ్బు లేదని ఆసుపత్రి వారి ఖాతా నెంబర్ తెస్తే మనీ ట్రాన్స్ ఫర్ చేస్తామని చెబుతున్నారు. తెలంగాణలో బ్యాంకుల ఆర్థిక దుస్థితి ఎలాంటి దురవస్థలో ఉందో తెలుసుకోవడానికి  ఈ ఒక్క ఘటన చాలు 
 
పెద్ద నోట్ల రద్దుకు ముందు సగటున రోజుకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు నగదు లావాదేవీలు నిర్వహించిన బ్రాంచీల్లోనూ ఇప్పుడు పదో వంతు నగదు లావాదేవీలు జరగడం లేదు. దీంతో సాధారణ జనంతోపాటు ఉద్యోగులు, వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఖరీఫ్‌ సీజన్‌ మొదలుకావడంతో రైతులను నోట్ల కష్టాలు వెంటాడుతున్నాయి. 
 
గతేడాది నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రాష్ట్రంలో రూ.80 వేల కోట్లకు పైగా పాత రూ.500, రూ.1,000 నోట్లు బ్యాంకుల్లో జమయ్యాయి. కానీ అంత మొత్తానికి సరిపడా కొత్త నోట్లను ఆర్‌బీఐ ఇప్పటికీ సరఫరా చేయలేకపోయింది. ఇప్పటివరకు తెలంగాణకు పంపిణీ చేసిన కొత్త నోట్లు కేవలం రూ.49 వేల కోట్లేనని ఆర్‌బీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇక మే నెల నుంచి అయితే కొత్త నోట్ల పంపిణీని పూర్తిగా నిలిపివేసింది. 
 
రోజువారీ లావాదేవీల్లో భాగంగా బ్యాంకులకు వచ్చే నగదునే అన్ని బ్యాంకులకు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. దీంతో నోట్ల సమస్య మళ్లీ తీవ్రమైంది. బ్యాంకుల నుంచి తమకు ఆశించినంత నగదు రావడం లేదని.. అందుకే ఏటీఎంలు, బ్రాంచీలకు సరిపడేంత నగదు ఇవ్వలేకపోతున్నామని ఆర్‌బీఐ
అధికారులు చెబుతున్నారు. 
 
బ్యాంకుల్లో రోజువారీ నగదు జమలు గణనీయంగా పడిపోయాయని, అందుకే తాము రిజర్వుబ్యాంకుకు నగదును పంపలేకపోతున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. డబ్బులు డ్రా చేసుకునేందుకే తప్ప.. జమ చేసేందుకు వచ్చే ఖాతాదారుల సంఖ్య సగానికిపైగా తగ్గిపోయిందని ఇటీవలి సమీక్షలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. బ్యాంకుల్లో డబ్బులు జమ చేసినా, డ్రా చేసినా కూడా చార్జీల మోత మోగిపోతుందనే ప్రచారమే అందుకు కారణమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.