తితిదే ఛైర్మన్గా చదలవాడ కృష్ణమూర్తి... సభ్యుడుగా రాఘవేంద్రరావు!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చదలవాడ కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.
అలాగే, టీటీడీ ఆలయ బోర్డులో సభ్యులుగా టాలీవుడ్ అగ్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు, కొండపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయులు, ఏవీ రమణ, సండ్ర వెంకటవీరయ్య, పిల్లి అనంతలక్ష్మీ, కోళ్ల లలితకుమారి, సాయన్న, వై.టి.రాజా, పుట్టా సుధాకర్ యాదవ్, పి.హరి ప్రసాద్, డీపీ.అనంత, భానుప్రకాశ్ రెడ్డిలకు చోటు కల్పించారు.
చిత్తూరు, తిరుపతికి చెందిన చదలవాడ కృష్ణమూర్తి జిల్లా టీడీపీలో సీనియర్ నేత. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను పోటీకి దూరంగా ఉంచారు. ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకు చదలవాడ కృష్ణమూర్తికి చంద్రబాబు టీటీడీ ఛైర్మన్ పదవిని కేటాయించారు.