శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2015 (13:37 IST)

రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవారి వైభవోత్సవాలు.. చెన్నైలో శ్రీవారి ఆలయం: తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి

రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవారి వైభవోత్సవాలను నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. చెన్నైలోని తితిదే సమాచార కేంద్ర సందర్శనకు వచ్చిన ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ భక్తుల చెంతకే శ్రీవారు అనే పేరుతో నిర్వహిస్తున్న 'శ్రీవారి వైభవోత్సవాల'ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. 
 
ఇప్పటికే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్, గుంటూరు, నెల్లూరులలో ఈ వైభవోత్సవాలను నిర్వహించగా, భక్తుల నుంచి అనూహ్య స్పందన, ప్రశంసలు వచ్చాయన్నారు. అందుకే ఈ తరహా కార్యక్రమాలను మరిన్నింటిని నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. తిరుమలలో ఏ విధంగా అయితే శ్రీవారికి సేవలు, ఇతర కైంకర్యాలు నిర్వహిస్తామో అదే విధంగా శ్రీవారి వైభవోత్సవాల్లోనూ నిర్వహిస్తామని తెలిపారు. 
 
ఇకపోతే తమిళనాడు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించినట్టయితే చెన్నైలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామన్నారు. తిరుమలలో ఏ విధంగా అయితే శ్రీవారి ఆనంద నిలయాన్ని నిర్వహించారో అదేవిధంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మిస్తామన్నారు. అయితే, ఇందుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం సమకూర్చాల్సి ఉందన్నారు. అలాగే, కన్యాకుమారిలో నిర్మాణ పనులు ప్రారంభించిన శ్రీవారి ఆలయ నిర్మాణ పనులను నిలిపివేసినట్టు చెప్పారు. 
 
ఈ పనులను అప్పగించిన సంస్థ చేస్తున్న పనుల్లో సంతృప్తికరంగా లేక పోవడంతో పాటు సక్రమంగా చేయక పోవడంతో ఈ పనులను నిలిపి వేయించామన్నారు. నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మరో కంపెనీని అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే, చెన్నైలోని శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులకు శ్రీవారి ప్రసాదం కొరత తీవ్రంగా ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై బ్రహ్మోత్సవాల తర్వాత దృష్టిసారించి, ప్రస్తుతం చెన్నైకు పంపుతున్న 7500 లడ్డూల స్థానంలో 15000 వేల లడ్డూలను పంపనున్నట్టు ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు.