శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 17 డిశెంబరు 2014 (20:08 IST)

శ్రావణి ఫిర్యాదు... అత్తారింటి నుంచి ప్రాణహాని... హెచ్చార్సీకి చక్రి భార్య

తన అత్తారింటిపై దివంగత సంగీత దర్శకుడు చక్రి సతీమణి శ్రావణి మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ)కి ఫిర్యాదు చేయడం ఇపుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. తన భర్త చక్రి కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణ హానీ ఉందని ఆమె చెప్పడమే కాకుండా హెచ్చార్సీలో పిర్యాదు కూడా చేశానని శ్రావణి తెలియజేశారు. చక్రి చనిపోయిన క్షణం నుంచి తనను మానసికంగా హింసిస్తున్నారనీ, తన రూంలోని కప్‌బోర్డుకు తాళం వేశారని ఆమె చెప్పారు. 
 
చక్రి తల్లిదండ్రులు, ఆయన అక్కా చెల్లెళ్ళ నుంచి తనకు ప్రాణహాని వుందని సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి చెప్పడం ఇపుడు షాకింగ్ గా మారింది. సంగీత దర్శకుడు చక్రి మరణించిన తర్వాత ఈ రెండు రోజుల్లో జరిగిన సంఘటనలు, గొడవలు తనకు ప్రాణహాని వుందన్న భయాన్ని కలిగించాయని, అందువల్ల తాను మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. చక్రి ఉన్నన్నాళ్లు తమను ఎంతమాత్రం పట్టించుకోనివారు చక్రి చనిపోయాక వేధిస్తున్నారంటూ ఆమె వాపోయారు. చక్రి తరఫు మనుషుల వల్ల తనకు భవిష్యత్తులో ప్రాణహాని ఉందేమోనన్న భయంతోనే తాను హెచ్చార్సీని ఆశ్రయించినట్లు శ్రావణి వివరించారు.
 
చక్రిని చంపే ప్రయత్నం నువ్వే చేశావంటూ తనను తన అత్తమామలు వేధిస్తున్నారనీ, మానసికంగా హింసిస్తున్నట్లు ఆమె వాపోయారు. చక్రి, శ్రావణిలది ప్రేమవివాహమన్న సంగతి తెలిసిందే. వారిరువురు పెళ్లి చేసుకున్న తర్వాత దూరమైనవారు నెల రోజుల క్రితం అత్త, మరిది విడిగా వెళ్లిపోయినట్లు శ్రావణి వెల్లడించింది. చక్రి మరణించిన తర్వాత ఇపుడు వారంతా నేరుగా చక్రి ఇంట్లో ఉంటున్నారు. వారంతా చక్రి ఆస్తుల కోసమే వచ్చారనే ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో శ్రావణి హెచ్ఆర్సీని ఆశ్రయించడం చర్చనీయాంశమైంది.
 
తన పరిస్థితిని వివరిస్తూ శ్రావణి... చక్రి ఆరోగ్యం గురించి ఎన్ని ఫోన్లు చేసినా ఎవ్వరూ రిప్లై ఇవ్వలేదని వాపోయారు. చక్రి చనిపోయాక వాళ్లు ఎప్పుడొచ్చారో తనకు తెలియదనీ, ఫిలిం చాంబర్లో మృతదేహం ఉన్నప్పుడు, తాను ఇక్కడుంటే వారు తన ఇంట్లో ఉన్న వాళ్ల సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారనీ, తన కప్ బోర్డులకు తాళాలు వేసి, చక్రి డెబిట్ కార్డులు, చెక్కు పుస్తకాలు, ఉంగరాలు, గొలుసులు అన్నీ తీసుకెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. తనకు కనీసం ఇపుడు కట్టుబట్టలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చక్రి మరణం తర్వాత శ్రావణి పరిస్థితి ఇపుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.