శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (11:22 IST)

చంద్రబాబు ఈ-కేబినెట్‌ వివరాలేంటో తెలుసుకోండి.. పీఎంఓకు మోడీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు సరికొత్త చరిత్రను సృష్టించారు. దేశంలోనే మొదటిసారిగా ఒక్క కాగితం కూడా వాడకుండా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన ఘనతను దక్కించుకున్నారు. ఈ తరహా కేబినెట్ సమావేశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. ఆయన కార్యాలయ అధికారులు సైతం ఆసక్తి చూపించారంటే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. పైగా... ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
వాస్తవానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడంలో చంద్రబాబు నాయుడు దేశంలోని ఇతర రాజకీయ నేతలకంటే ముందు వరుసలో ఉంటారు. ఇపుడు మరో అడుగు ముందుకేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిధి గృహంలో ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. సాధారణంగా ప్రతి మంత్రివర్గ సమావేశానికి ముందు ఎజెండాను మంత్రులకు పంపుతారు. 
 
కొన్ని నివేదికలను, సమాచారాన్ని కూడా అందిస్తారు. ఆ అంశాల ప్రాధాన్యాన్నిబట్టి... కొన్ని రోజుల ముందుగానీ, అప్పటికప్పుడుగానీ ఇది జరుగుతుంది. మొత్తంగా ఒక్కో మంత్రికి 60-70 పేజీల పత్రాలు అందుతాయి. ఒక్కోసారి అంతకుమించే ఉంటాయి. ఇక... సమావేశానికి వచ్చే అధికారులు కూడా తమతో ఫైళ్లు తీసుకొచ్చి, వాటిలో అవసరమైన పత్రాల ప్రతులను మంత్రులకు అందిస్తారు. మొత్తానికి... కేబినెట్‌లో భారీస్థాయిలో కాగితాలతో కుస్తీ పడిన తర్వాతే నిర్ణయాలు వెలువడతాయి. 
 
కానీ, సోమవారం నాటి కేబినెట్‌లో ఒక్క కాగితం కూడా కనిపించలేదు. (ఏదైనా రాసుకోవడానికి వీలుగా మంత్రులకు ఒక చిన్న నోట్‌ బుక్‌ మాత్రం ఇచ్చారు.) అనేక కీలక నిర్ణయాలకు ఈ భేటీ వేదికైంది. దీని వెనుక భారీ కసరత్తు జరిగింది. ఈ-కేబినెట్‌లో భాగంగా... మంత్రులందరికీ ముందుగానే ఐప్యాడ్లు ఇచ్చారు. ఇంటర్నెట్‌ ద్వారా సమావేశ ఎజెండాను నేరుగా వాటికి పంపారు. 
 
ఎజెండాకు అనుబంధంగా ఉండే సమాచారం, ఇతర అనుబంధాలను కూడా ‘అటాచ్‌మెంట్‌’ రూపంలో మంత్రుల ఐప్యాడ్లకు చేరవేశారు. ఫైళ్లకు బదులుగా... మంత్రులు సింపుల్‌గా ఐప్యాడ్లతో వచ్చారు. ముఖ్యమైన అంశాలపై అధికారులు మంత్రివర్గ సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. వాటికి సంబంధించిన అదనపు వివరాలను మంత్రులు తమ ఐప్యాడ్లలో ఎప్పటికప్పుడు చూసుకున్నారు. చాలామంది మంత్రులు ముందుగానే ఐప్యాడ్ల వాడకంపై శిక్షణ తీసుకుని సమావేశానికి వచ్చారు.