శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (15:33 IST)

నారావారిపల్లెలో జగన్ పార్టీ గెలవడంతోనే?: కొడాలి నాని

నారావారిపల్లెలో జగన్ పార్టీ గెలుపును టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లెలో వైకాపా గెలిచిన నేపథ్యంలో.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొడాలి నాని మాట్లాడారు. 
 
నారావారిపల్లెలో జగన్ గెలుపువల్లే టీడీపీ నేతలు వైకాపా నేతలపై విమర్శలు చేస్తున్నారని నాని దుయ్యబట్టారు. చెవిరెడ్డి భాస్కర రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుండి తప్పించడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ కుట్రల్లో సభాపతి కోడెల శివప్రసాద రావు భాగం కాకుండా ఉండాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.
 
కాగా, అంతకుముందు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూతో కలిసి స్పీకర్ కోడెల శివప్రసాద రావుతో భేటీ అయ్యారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసు పైన చర్చించారు. తాను ఎవర్నీ కించపర్చేలా మాట్లాడలేదని, సభ అంటే తనకు గౌరవం ఉందని చెవిరెడ్డి చెప్పారు.
 
మరోవైపు, అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసిన శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలను తిరిగి సభకు అనుమతించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోరింది. అయితే, సభ సంప్రదాయానికి అనుగుణంగా వారు క్షమాపణ కోరితే సస్పెన్షన్ రివోక్ చేయవచ్చునని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.