మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:26 IST)

జగన్ వస్తే కొంప కొల్లేరే.. మేమొస్తే.. అమరావతి, పోలవరం పూర్తి.. చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం, అమరావతి పూర్తి చేస్తామని.. వైకాపా చీఫ్ జగన్‌కు అధికారం ఇస్తే అవన్నీ ఆగిపోతాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జగన్‌కు ఓటు వేస్తే నరేంద్ర మోదీకి ఓటు వేసినట్టే అని.. జగన్ సీఎం అయితే రాష్ట్రంలో మైనారిటీలకు భద్రత లేకుండా పోతుందని ఆరోపించారు. 
 
ఎన్నికల్లో టీడీపీని ఏపీ ప్రజలంతా ఆశీర్వదించి గెలిపించాలని ప్రతీ ఒక్కరికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే మీ బిడ్డల భవిష్యత్ బాగుంటుందని.. జగన్ అధికారంలోకి వస్తే అరాచకాలు పెరిగిపోతాయని చెప్పారు. తాము అధికారంలో ఉంటే భూముల రేట్లు పెరుగుతాయని.. జగన్ అధికారంలో ఉంటే అవినీతి పెరిగిపోతుందని పేర్కొన్నారు.  
 
సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం ముగింపు అనంతరం అమరావతి ప్రజావేదికలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర పరిస్థితులను ప్రస్తావించారు. ఈ క్రమంలో నరేంద్ర మోదీ ఇచ్చిన మాట తప్పిన వైనాన్ని అందరికీ గుర్తుచేశారు. అందుకోసం గత ఎన్నికల్లో మోదీ ఏపీలో బహిరంగ సభల్లో ఏమేమి హామీలు ఇచ్చారో ప్రత్యేకంగా క్లిప్పింగ్‌లు వేసి ప్రదర్శించారు.  
 
ఆ తర్వాత కేసీఆర్ గతంలో ఏమన్నాడో కూడా క్లిప్పింగ్స్ రూపంలో చూపించారు. ఆఖరికి కల్వకుంట్ల కవిత కూడా పోలవరం ప్రాజక్ట్‌కు వ్యతిరేకంగా తామేం చేశామో వివరంగా చెప్పడం మరో క్లిప్‌లో చూపించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై అప్పుడేమన్నారో ఇప్పుడేమన్నారో కూడా చంద్రబాబు స్వయంగా యాంకరింగ్ చేస్తూ ఒక్కో క్లిప్‌ను ప్రదర్శించారు. 
 
ఓ క్లిప్‌లో కవిత మాట్లాడుతూ, జగన్ వస్తాడు, పోలవరం కడతాడు, అంటున్నారని, అన్ని కేసులున్న నాయకుడ్ని తెలంగాణ జైళ్లలో కూడా ఉంచబోమని చెప్పారు. అలాంటి నాయకుడ్ని తమ జైళ్లలో పెడితే జైళ్ల భూముల్ని కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుందన్నారు. అందుచేత ఏపీలో టీడీపీనే అధికారంలోకి రావాలని చంద్రబాబు చెప్పకనే చెప్పారు.