బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 6 జులై 2017 (08:51 IST)

పాలకుడి గుండె చెమర్చిన వేళ.. ప్రసన్నకు బాబు అభయహస్తం

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో బహిరంగంగా తొలిసారిగా కంట తడిపెట్టిన పాలకుడాయన. కన్నతండ్రి కర్కోటకుడిగా మారి భార్యబిడ్డలను హతమార్చిన ఘటనలో అనాథగా మిగిలిన లక్ష్మీప్రసన్న పరిస్థితిని చూసి చలించిపోయిన చంద్రబాబ

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో బహిరంగంగా తొలిసారిగా కంట తడిపెట్టిన పాలకుడాయన. కన్నతండ్రి కర్కోటకుడిగా మారి భార్యబిడ్డలను హతమార్చిన ఘటనలో అనాథగా మిగిలిన లక్ష్మీప్రసన్న పరిస్థితిని చూసి చలించిపోయిన చంద్రబాబు, సభావేదికపైనే కంటతడి పెట్టుకున్నారు. చంద్రబాబు కంట తడిని తొలిసారిగా చూసిన సభా ప్రాంగణంలోని వందలాదిమంది ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భావోద్వేగంతో మూగపోయారు. అప్పుల బాధ తట్టుకోలేక కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలను సుత్తితో కొట్టి చంపేసిన తండ్రి ఘాతుక చర్య ముఖ్యమంత్రిని నిలువునా కదిలించివేసింది. క్రీడాకారులు విజయాలు సాదిస్తే లక్షలాది రూపాయలు నజరానాగా ప్రకటించే బాబు సర్వం కోల్పోయి అనాథగా మిగిలిన చిన్నారికి సొంత అన్నయ్యలా ఉంటానని మాట ఇచ్చారు. 20 లక్షల భారీ నజరానాను ప్రకటించారు.
 
 
నాన్న చేసిన పనికి కుటుంబం మొత్తం పోయాక తానెందుకు బతకాలి. నా లాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదని ప్రార్థిస్తున్నా అంటూ హంతకుడై ఆత్మహత్య చేసుకున్న రామసుబ్బారెడ్డి మిగిలివున్న కుమార్తె లక్ష్మీప్రసన్న విలపిస్తుంటే చూసి తట్టుకోలేకపోయిన చంద్రబాబు తన సీఎం హోదా కూడా పక్కనబెట్టి ఆమెను అక్కున చేర్చుకున్నారు. 20 నిమిషాలు గద్గద స్వరంతోనే ప్రసంగించిన బాబు  ఏ కష్టమొచ్చినా తనకు చెప్పాలని, తల్లిదండ్రులు లేని లోటు నేను తీరుస్తా. సంరక్షకుడిగా మార్గనిర్దేశకుడిగా ఉంటా.’ అని ఓదార్చారు.
 
‘రామసుబ్బారెడ్డి కుమార్తెలు మాణిక్యాలు. ఒకమ్మాయి ఎంఎస్పీ, మరో అమ్మాయి బీటెక్‌, ఇంకో అమ్మాయికి ట్రిపుల్‌ ఐటీ సీటొచ్చింది. అలాంటి పిల్లలతోపాటు భార్యనూ చంపేశాడు. లక్ష్మీప్రసన్న అక్కడ లేకపోవడంతో ప్రాణాలు దక్కించుకుంది. ఆమె మానవత్వం కలిగిన మనిషి. అంత కిరాతకంగా తనవారిని చంపినా తన తండ్రిని కడసారిగా చూడాలని అడిగింది.’ అన్నారు. లక్ష్మీప్రసన్నకు రూ.20 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నట్లు సభాముఖంగా ప్రకటించారు. ఆర్థికసాయమే కాదు.. మనసున్న వ్యక్తిగా.. మానవత్వం ఉన్న మనిషిగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని విధాలుగా లక్ష్మీప్రసన్నను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనుకోని ఘటనల్లో అయినవారందరినీ కోల్పోయి నైరాశ్యంలో ఉన్నవారికి భరోసా కల్పించేందుకు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.లక్ష్మీప్రసన్నకు భవిష్యత్తుపై భరోసా ఇవ్వడానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా రిజర్వు చేసి ఉంచామని తెలిపారు.