శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 2 జులై 2015 (07:27 IST)

మ‌హా పుష్క‌ర‌మిది.... అనుసంధానంతో గోదావ‌ర‌మ్మ రుణం తీర్చుకుంటా... చంద్ర‌బాబు

ఇది సాధాసీదాగా వ‌చ్చే పుష్క‌రం కాద‌నీ, 144 యేళ్ళకు ఒక్క‌మారు వ‌చ్చే మహా పుష్క‌ర‌మ‌ని రాష్ట్ర‌ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. అందుకే దీనిని ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంద‌ని చెప్పారు. 12 యేళ్ళ‌కు ఒక్క‌మారు వ‌చ్చే పుష్క‌రాలు కాకుండా మ‌హా పుష్క‌రాలు మ‌న స‌మ‌యంలో జ‌ర‌గ‌డం మ‌న అదృష్ట‌మ‌ని ఆయ‌న చెప్పారు. అందుకే తెలుగు ప్రజల జీవనాడి అయిన‌ ఆ తల్లి రుణం తీర్చుకునే సమయం ఇదేన‌ని ఉద్వేగ‌భ‌రితంగా అన్నారు. న‌దుల అనుసంధానంతో రుణం తీర్చుకుంటాన‌ని చెప్పారు. 
 
ఇందులో గోదావరివాసులు భాగస్వాములు కావాలి  అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గోదావరి నిత్య హారతి ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన బుధవారం రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. గోదావరి నిత్యహారతి కార్యక్రమం అట్టహాసంగా ఆరంభమైంది. దేవాదాయశాఖ, బుద్ధవరపు చారిటబుల్ ట్రస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత గోదావరికి పూజలు చేసి హారతి ఇచ్చారు. 
 
నదుల అనుసంధానం ద్వారా గోదావరి నీటిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తీసుకువెళ్లాలనే కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఉన్నాయని చంద్ర‌బాబు అన్నారు. దీనిలో భాగంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం మద్దతుతో పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నానని చెప్పారు. పుష్కరాల సందర్భంగా కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వంటకాలు, పంటలను ప్రదర్శిస్తామన్నారు. రాజమండ్రిని సాంస్కృతిక కేంద్రం చేస్తానని ప్రకటించారు.
 
చరిత్ర ఉన్నంత వరకు ఇది ఘనంగా కొనసాగాలి అని చంద్రబాబు అన్నారు. అనంతరం ఆయన పుష్కర శంఖాన్ని పూరించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, పైడికొండల మాణిక్యాలరావు, పి.నారాయణ, పీతల సుజాత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, బుద్ధవరపు ట్రస్ట్ ఈడీ బి.ఎస్.ఎన్.కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.