బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (13:58 IST)

కళ్లార్పకుండా అబద్ధాలు చెపుతున్న చంద్రబాబు : జగన్ మోహన్ రెడ్డి

రైతు రుణ మాఫీ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శనివారం దద్ధరిల్లి పోయింది. ముఖ్యంగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విపక్ష నేత జగన్ విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలాడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబులాగా అబద్ధాలాడే వ్యక్తిని తానెప్పుడూ చూడలేదన్నారు. 
 
ఈ సందర్భంగా జగన్ చేసిన సంజ్ఞలు టీడీపీ సభ్యులను ఉడికించగా, వైఎస్సార్సీపీ సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అసలు, రుణమాఫీలో రైతులకిస్తున్నదెంత? తదితర విషయాలు చెప్పాలని అడిగితే సమాధానం లేకపోతే ఎలాగంటూ ఆయన ఆసహనం వ్యక్తం చేశారు. కేస్ స్టడీలంటే అర్థం తెలియవారికి ఏం చెప్పేదంటూ జగన్ విస్మయం వ్యక్తం చేశారు. 
 
దీనిపై చంద్రబాబు కౌంటర్ అటాక్ ఇచ్చారు. శాసనసభలో విపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై సభ్యులకొచ్చే అనుమానాలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. సమస్యలపై మాట్లాడాల్సిన బాధ్యత ఉన్న వైకాపా సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారని మండిపడ్డారు. 
 
సమస్యలపై ప్రభుత్వం చెప్పే విషయాలు విపక్షాలకు అర్థం కాకపోతే మరోమారు వివరాల వెల్లడికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అవాస్తవాలతో మభ్యపెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. రుణమాఫీకి కేస్ స్టడీస్ కాదు... రియల్ స్టడీస్ కావాలని ఆయన తెలిపారు. ప్రతిపక్షం బినామీల గురించి మాట్లాడుతోందని చంద్రబాబు విమర్శించారు.