గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (07:13 IST)

భోజనాలు విసిరేసి... చేతులు తెగ్గోసుకుని... పరిశీలక బాలుర వింత నిరసన

వారందరూ.. వివిధ నేరాలలో నిందితులుగా ఉంటూ పరిశీలనా గృహంలో ఉన్న వారు. ఒక్క సారిగా తిరగబడ్డారు. తమను వెంటనే విచారించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరిని ఇప్పటికిప్పుడు కుదరదన్నందుకు భోజనాలు విసిరేశారు... గాజు పెంకులతో చేతు కోసుకున్నారు.. నానా బీభత్సం సృష్టించారు. తిరుపతి పరిశీలక బాలల వసతి గృహంలో సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుపతి పరిధిలోని మంగళం వద్ద ప్రభుత్వ బాల నేరస్తుల వసతి గృహం ఉంది.  ఇక్కడ నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన బాల నేరస్తులు ఉన్నారు. సోమవారం రాత్రి విచారణ నిమిత్తం న్యాయస్థానం బెంచ్ క్లర్క్ వచ్చారు. అయితే అప్పటికే కూడబల్కుని ఉన్న బాలలు తమను తక్షణం విచారించి విడుదల చేయాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. కేసులు ఎక్కువగా ఉన్నందున సత్వర విడుదల సాధ్యపడదని క్లర్క్ చెప్పడంతో వారు రెచ్చిపోయారు. 
 
ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, కుర్చీలను విరగ్గొట్టి భోజనాలను కిందికి నెట్టేశారు. గాజు పెంకులతో చేతులు కోసుకున్నారు. అధికారులు బాలనేరస్తులతో చర్చలు జరిపి వారి విడుదలకు సహకరిస్తామని సర్దిచెప్పారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.