శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2015 (12:40 IST)

అంగన్‌వాడీ మహిళల్ని బూతులు తిట్టిన చింతమనేని: చంద్రబాబుకు ఫిర్యాదు?

ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు వెళ్లిన అంగన్ వాడీ కార్యకర్తలను చింతమనేని ప్రభాకర్ నోటికొచ్చిన బూతులు తిట్టారట. దీంతోవారంతా చింతమనేని తీరుపై మండిపడుతున్నారు. అంగన్ వాడీ కార్యకర్తలను మహిళలు అని కూడా చూడకుండా చింతమనేని దారుణంగా తిట్టారని ఆరోపణలు వస్తున్నారు. 
 
''బలిసి కొట్టుకుంటున్నారు..'' అంటూ ఆయన దారుణంగా అవమానించారని పలువురు కంటనీరు పెట్టుకున్నారు. అక్కడితో ఆగని ఆయన మీపై నాన్ బెయిల్ బుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తా... ఏం చేస్తారే మీరు అంటూ వీరంగమాడారట. అంగన్వాడీ ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి హామీ ఇచ్చి నెలలు గడిచిపోతున్నా ప్రభుతం ఉత్తర్వులు జారీ చేయకపోవడంపై గడిచిన కొద్దిరోజులుగా అంగన్ వాడీలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
 
ఈ క్రమంలో ఏలూరు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ముగిసిన అనంతరం పక్కనే ఉన్న జడ్ పి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో అంగన్ వాడీ ఉద్యోగులు భోజనాలు చేస్తుండగా... ఆ సమయంలోనే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అక్కడికి వచ్చారు. దీంతో తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు అంగన్ వాడీ ఉద్యోగులు ఆయన వద్దకు వెళ్లారు. కానీ ఆయన వారు ఇంకా ఏమీ చెప్పకుండానే తిట్లదండకం మొదలుపెట్టారు. 
 
మహిళలని చూడకుండా బూతులు మాట్లాడారు. దీంతో ఆవేదనకు గురైన అంగన్ వాడీలంతా కలెక్టరేట్ నుంచి ప్రదర్శన నిర్వహించి చింతమనేని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చింతమనేనికి వ్యతిరేకంగా చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని వారు చెప్తున్నారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.