శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (14:58 IST)

అనీషాకు అసెంబ్లీ టిక్కెట్ ఇప్పించిన వైకాపా నేతలు.. ఔనా?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా నూతనకాల్వ అనీషా రెడ్డి అనే మహిళా నేత పోటీ చేయనున్నారు. ఈమెకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టిక్కెట్ కేటాయించడానికి ప్రధాన కారణం వైకాపా నేతలే. వారి చర్యలు, విధించిన ఆంక్షల వల్లే అనీషా రెడ్డి పార్టీ అధినేత దృష్టిలోపడ్డారు. ఫలితంగా ఆమెకు అసెంబ్లీ టిక్కెట్ దక్కించుకున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా రాయచోటి మండలం బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు రఘురామరెడ్డి కుమార్తె అయిన అనీషారెడ్డికి తొలినుంచీ రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు. గత మూడు పర్యాయాలుగా పార్టీ టికెట్‌ కోసం రేసులో ఉన్నారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి మరదలు అనీషారెడ్డి గెలుపుకోసం పలుమార్లు పుంగనూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమైపోయారు. 
 
ఈ నేపథ్యంలో పుంగనూరు అసెంబ్లీ స్థానం నుంచి గత రెండు పర్యాయాలు ఎం.వెంకటరమణరాజు పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయన స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలన్న ఆలోచన చేస్తుండగా, అనీషా రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఆమె పార్టీ చేస్తున్నసేవ, తదితర వివరాలను పరిగణనలోకి తీసుకుని ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు. 
 
ముఖ్యంగా, ఇటీవల జరిగిన జన్మభూమి గ్రామసభల్లో వైసీపీ నాయకులు ప్రోటోకాల్‌ పేరుతో వేదికమీదకు అనీషారెడ్డిని రాకుండా అడ్డుకున్నారు. కానీ, ఆమె మాత్రం ప్రజలే మాకు ప్రోటోకాల్‌ అంటూ వేదికల వద్ద నేలపై కూర్చుని ప్రసంగించేవారు. అలా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోగలిగారు. పార్టీ క్యాడర్‌కు అవసరమైన సమయాల్లో అండగా ఉంటూ వచ్చారు. 
 
పుంగనూరు ప్రాంతానికి హంద్రీనీవా కాల్వ ద్వారా కృష్ణాజలాలు రావడం, నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు, పసుపు, కుంకుమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా తెలుగుదేశం పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు ఆమెకు టిక్కెట్ కేటాయించారు.