గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 25 జులై 2016 (13:05 IST)

ముందు సార్‌తో మాట్లాడండి.. లేకుంటే సంతకం ఎలా పెట్టను? చిత్తూరు జడ్పీ ఛైర్‌పర్సన్ తీరిది!

రాజకీయాల్లో ఉన్న ప్రముఖుల కంటే వారి సన్నిహితులే ప్రతి విషయానికి ముందుంటారు. అయితే కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం తమ అధికారాన్ని ఎవరికీ ఇవ్వరు.

రాజకీయాల్లో ఉన్న ప్రముఖుల కంటే వారి సన్నిహితులే ప్రతి విషయానికి ముందుంటారు. అయితే కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం తమ అధికారాన్ని ఎవరికీ ఇవ్వరు. వారు మాత్రమే ఆ పదవి, పదవికి ఉన్న గొప్పతనాన్ని అనుభవించాలని భావిస్తుంటారు. మరికొంతమంది మాత్రం బంధువులకు ఆ అవకాశం ఇస్తుంటారు. అదే పరిస్థితి చిత్తూరు రాజకీయాల్లో కూడా ఉంది. వారే చిత్తూరు జడ్పీ ఛైర్‌ పర్సన్‌ గీర్వాణి చంద్రప్రకాష్‌.
 
రాజకీయాలకు కొత్తే. కానీ తెలుగుదేశం పార్టీ అండదండలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. దీంతో చిత్తూరు జడ్సీ ఛైర్‌పర్సన్‌ పీఠాన్ని అధిరోహించారు గీర్వాణి. ఆమె భర్త చంద్రప్రకాష్‌. ఈయన తెలుగుదేశం పార్టీలో సాధారణ నాయకుడు. భార్యకి అతి పెద్ద పదవి ఉండడంతో ఇక ఆయన ఎక్కడా తగ్గడు. జడ్పీ సమావేశాలన్నా, పార్టీ కార్యక్రమాలన్నా, మంత్రులు ఇలా ఏ కార్యక్రమం జరిగినా ఆయనే ముందుంటారు. కార్యక్రమం జరుగుతున్న సభాస్థలిపై మొదటి వరుసలో ఆయనే ఎక్కువగా కనిపిస్తుంటారు. 
 
గీర్వాణి మృదుస్వభావురాలు. ఏ కార్యక్రమానికి వెళ్ళినా సైలెంట్‌గా ఉండిపోతారు. పెద్దగా మాట్లాడరు. మైక్‌ తీసుకుంటే చంద్రబాబునాయుడును పొగడ్తలతో ముంచెత్తుతారు. ఇదే ఆమెకు తెలిసింది. ఇక మొత్తం తతంగం మొత్తం సారే. అంటే చంద్రప్రకాషే. జడ్పీ నిధుల నుంచి ప్రతి ఒక్కటి ఈయన కనుసన్నల్లో జరగాల్సిందే. ఏ ఫైలు పైనా అయిన సరే ఛైర్‌‌పర్సన్‌ సంతకం పెట్టాలన్న ముందుగా సార్‌ నుంచి వెళ్ళాల్సిందే. అలాగే ఎవరు కలవాలన్నా ముందు సార్‌ను కలిసి వెళ్ళాల్సిందే. ఇది జడ్పీ కార్యాలయంలో పరిస్థితి.
 
ఇది ఇప్పటిది కాదు. గీర్వాణి జడ్పీ ఛైర్‌పర్సన్‌ అయినప్పటి నుంచి ఇదో తంతు. చంద్రప్రకాష్‌ తీరుపై ఇప్పటికే స్థానిక నేతలు కొంతమంది జడ్పీటీసీ, ఎంపీటిసీ సభ్యులు తెదేపా సీనియర్‌ నేతలకు ఫిర్యాదులు కూడా చేశారు. అయితే వారు ఏ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు కదా చంద్రప్రకాష్‌కే సహకరిస్తున్నారు. దీంతో చంద్రప్రకాష్‌ ఆడిందే ఆట పాడిందే పాట. చంద్రప్రకాష్‌పై అధినేతకు ఫిర్యాదు చేసేందుకు కొంతమంది స్థానిక జడ్పీటీసీ సభ్యులు సిద్ధమయ్యారు. త్వరలో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న బాబును కలిసి వీరు ఫిర్యాదు చేయనున్నారు. మొత్తం మీద చంద్రబాబునాయుడు చంద్రప్రకాష్‌ విషయంపై ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.