ఆద్యంతం ప్రణబ్తోనే బాబు... రకరకాల వంటలతో టీటీడీ విందు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుపతి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన వెన్నంటే ఉన్నారు. పర్యటన పూర్తయ్యే వరకూ ఆయనతోనే గడిపారు. దగ్గరుండి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించారు. రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి బుధవారం ఉదయం 10 గంటలకే ఆయన తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. 10.30 గంటలకు రాష్ట్రపతికి స్వాగతం పలికి రాష్ట్ర మంత్రులను, చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలను పరిచయం చేశారు.
అక్కడి నుంచి పర్యటన పూర్తయ్యే వరకూ రాష్ట్రపతితో కలిసి ఒకే కారులో ప్రయాణించారు. తిరుమల ఆలయంలో కూడా చంద్రబాబు, దర్శనానంతరం పద్మావతి అతిథి గృహం చేరుకున్నాక భోజన సమయంలో సైతం చంద్రబాబు, ప్రణబ్ముఖర్జీ చాలాసేపు ముచ్చటించుకున్నారు. తిరుగు ప్రయాణంలో కూడా.. చంద్రబాబును రాష్ట్రపతి స్వయంగా పిలిచి తనతో పాటు కారెక్కించుకోవడం విశేషం.
రాష్ట్రపతి తిరుమల వచ్చిన సందర్భంగా ఆహారం విషయంలో టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెనూ సిద్ధం చేసింది. ఎక్కువగా బెంగాలీ వంటకాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. పాలక్ పన్నీరు, గోబీ మంచూరియా, ఆలుగ్రీన్పీస్, బాయిల్డ్ వెజ్, వెజిటబుల్సూప్, స్వీట్ కార్న్ సూప్, పుచ్చకాయ జ్యూస్, ఉడక బెట్టిన పప్పు దినుసులు, రసగుల్ల, గులాబ్జామ్, వివిధ రకాల కేకులు, డ్రైప్రూట్స్ తదితరాలను సిద్ధం చేశారు.