గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (11:07 IST)

బాణాసంచా గోడౌన్‌లో పేలుడు.. ఏడుగురు మృతి.. కుటుంబానికి రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియా..!

విశాఖపట్నం జిల్లాలో సంభవించిన బాణాసంచ గోడౌన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. క్షతగాత్రుల్లో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలుపుతూ.. ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.
 
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. 
 
జిల్లాలోని ఎస్. రాయవరం మండలం గోకులపాడులోని బాణాసంచా గోడౌన్లో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. కాగా ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో 16నుంచి 18మంది వరకు కూలీలు పనిచేస్తున్నట్టు అక్కడి స్థానికులు చెబుతున్నారు. బాణాసంచా పేలుడు ఘటనలో బాధితులంతా కూలీలేనని పోలీసులు తెలిపారు. 
 
క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్, నక్కపల్లి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్టు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు చేపట్టకుండా మందుగుండును నిలువ ఉంచడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.