శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 30 మే 2017 (05:13 IST)

మావాళ్లు గీత దాటుతున్నారు.. వలస నేతలూ తక్కువ తినలేదు.. అందరికీ వాత పెడతానన్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీపై అధినేత పట్టు కోల్పోతున్నారా? ఎన్టీరామారావు అనంతరం టీడీపీని కంటి చూపుతోనే శాసించిన చండశాసనుడు చంద్రబాబు ఇప్పుడు కళ్లముందే పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారా? పార్టీలో మొదటినుంచి ఉంటున్న నాయకులకు,

తెలుగుదేశం పార్టీపై అధినేత పట్టు కోల్పోతున్నారా? ఎన్టీరామారావు అనంతరం టీడీపీని కంటి చూపుతోనే శాసించిన చండశాసనుడు చంద్రబాబు ఇప్పుడు కళ్లముందే పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారా? పార్టీలో మొదటినుంచి ఉంటున్న నాయకులకు, అనివార్యంగా, దూరదృష్టితో పార్టీలోకి తీసుకువచ్చిన వలసనేతలకు మధ్య ముదురుతున్న వైరుధ్యాలను పరిష్కరించడం సాధ్యం కాక, గొంతెత్తుతున్న అసమ్మతి స్వరాలను కంట్రోల్ చేయలేక చంద్రబాబు క్రియాశూన్యంగా వ్యవహరిస్తున్నారా? 
 
తమ పార్టీలోని క్రమశిక్షణా రాహిత్యాన్ని నర్మగర్భంగా అంగీకరించడంతోనే చంద్రబాబు గతంలో వలే తాను కఠినంగా వ్యవహరించలేకపోతున్న విషయాన్ని తనకుతానుగా వెల్లడించేశారు. సోమవారం విశాఖపట్నంలో మూడవరోజున మహానాడు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పిన విషయాన్ని నేరుగా వ్యాఖ్యానించారు. 
 
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు..అలాంటి పార్టీలో నేడు క్రమశిక్షణ లోపిస్తోంది.. పార్టీ నేతలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు. సమస్యంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి వల్లే. వారిని కలుపుకొని పార్టీలో ఉన్న పాతతరం, యువతరం ముందుకెళ్లలేక పోతోంది. లక్ష్మణరేఖ దాటుతున్నారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
పార్టీలోని క్రమశిక్షణా రాహిత్యాన్ని  ముఖ్యమంత్రి నర్మగర్భంగా అంగీకరించారు. అన్నీ సెట్‌రైట్‌ చేస్తా.. అందుకే తెలంగాణా పార్టీపై దృష్టి పెట్టలేకపోతున్నా... అక్కడి వారికి సమయం కేటాయించలేకపోతున్నా.. అని చెప్పుకొచ్చారు. మహానాడు అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయంలో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
 
తెలంగాణాలో ఒకలా.. ఆంధ్రాలో మరోలా బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన స్పందిస్తూ.... ఇలాంటి అంశాలపై అంతర్గతంగా తాము చర్చించుకుంటామని,, ప్రతి విషయంలోనూ రోడ్డెక్కి మాట్లాడలేమని తెలిపారు.  వచ్చే ఏడాదిలోగా స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పూర్తి చేస్తామని, ఆ తర్వాతే సార్వత్రిక ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. నిరుద్యోగభృతి విధానంపై అధ్యయనం చేస్తున్నామని, ఏ దేశంలో మంచి చేయూతనిస్తున్నారో గమనించి దాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు 90 లక్షల మంది వ్యూయర్స్‌ ట్విటర్స్, ఫేస్‌బుక్‌లో మహానాడు చూశారన్నారు.