గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (13:06 IST)

జపాన్ కన్సాయ్ ఎయిర్‌పోర్టులో ఏపీ సీఎం చంద్రబాబు అండ్ కో!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్‌లోని కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నారు. ఆదివారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి జపాన్ పర్యటన కోసం బయలుదేరిన చంద్రబాబు నేతృత్వంలోని 18 మంది సభ్యుల బృందం సోమవారం మధ్యాహ్నానికి కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ నుంచి క్యోటో వెళ్లారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సేకరణే లక్ష్యంగా వెళ్లిన సీఎం, సూర్యోదయ దేశం నుంచి సూర్యోదయ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం ఆరు రోజుల పర్యటనలో జపాన్ ప్రధాని, పారిశ్రామికవేత్తలతో బాబు బృందం సమావేశమై చర్చించనుంది. రాష్ట్ర శక్తి సామర్థ్యాలపై ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పలు సంస్థలతో ఆరు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.