శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2019 (15:05 IST)

ప్రభుత్వ విధానాలు విమర్శిస్తే చర్యలు : ఏపీ మంత్రివర్గం నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాలనతో పాటు విధానాలపై నిరాధార వార్తలు, కథనాల ప్రచురణ, ప్రసారాలపై చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. టేబుల్ ఐటెంగా రాష్ట్ర సమాచార శాఖ చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. నిరాధారమైన వార్తలు ప్రచురించినా ప్రసారం చేసినా, సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టిన కోర్టు కేసులు దాఖలు చేయాల్సిందిగా సంబంధిత శాఖల కార్యదర్శులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
 
ప్రభుత్వ పాలసీలపై నిరాధార వార్తలు, కథనాలపై రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావనకొచ్చింది. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ టేబుల్ ఐటెంగా ఉంచిన ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిరాధార వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థపై పరువు నష్టం కేసులు వేయాలని సంబంధిత విభాగాలకు మంత్రిమండలి సూచించింది. గతంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ద్వారా సదరు ప్రచురణ సంస్థకు రీజాయిండర్లు పంపిన ప్రభుత్వం ఇక సంబంధిత విభాగాల అధిపతులకే ఈ అధికారాలు అప్పగించింది.
 
ఈ వ్యవహారాలకు సంబంధించి 2007, ఫిబ్రవరి 20 తేదీన అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 938 ని అమలుకు నిర్ణయం తీసుకుంది. దురుద్దేశపూర్వకంగా ప్రసారం లేదా ప్రచురణ చేశారని భావిస్తే 24 గంటల్లోపు సదరు సంస్థ పై కోర్టుల్లో కేసులు వేయాల్సిందిగా సూచించింది. రాష్ట్ర సమాచార పౌరసంబంధాల కమిషనర్‌కూ ఈ తరహా కేసులు వేసేందుకు అధికారాలు కల్పించింది.
 
ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు బదిలీకి సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనం పూర్తి నిరాధారమని అధికారులు మంత్రివర్గం దృష్టికి తీసుకువచ్చారు. దానికి సంబంధించి సదరు శాఖ నుంచి ఖండన ఇచ్చినప్పటికీ ప్రాధాన్యమిచ్చి ప్రచురించకపోవటం పై చర్చ జరిగింది. ఇకపై అలాంటి కథనాలు వస్తే అందులో వాస్తవాలు పరిశీలించి.. అవాస్తవమైతే ఖండన ఇవ్వాలని కార్యదర్శులకు సీఎం ఆదేశించారు. 
 
అప్పటికీ సదరు మీడియా సంస్థ స్పందించకుంటే కోర్టుకెళ్లి ప్రాసిక్యూట్ చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మరోవైపు సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగులపైనా ప్రత్యేకంగా చర్చ జరిగింది. దీనిపైనా తగిన విధంగానే ప్రతిస్పందించాలని మంత్రి మండలి నిర్ణయించింది.