బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 25 జనవరి 2018 (10:47 IST)

స్టేషన్ లాకప్‌లో కోడి పుంజులు.. తిండి పెట్టలేక పోలీసుల అవస్థలు!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా కోడి పందేలు జరిగాయి. నిజానికి ఓ కోడి పందేల నిర్వహణపై అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి. కానీ వీటన్నింటినీ తుంగలో తొక్కి

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా కోడి పందేలు జరిగాయి. నిజానికి ఓ కోడి పందేల నిర్వహణపై అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి. కానీ వీటన్నింటినీ తుంగలో తొక్కి కోడి పందేల నిర్వహణ యధేచ్చగా సాగింది. 
 
అయితే, ఈ కోడి పందేల కోసం పెంచిన కోడి పుంజులకు పందేలకు ముందు మహారాజుల్లాగా బతికాయి. ఉదయాన్నే జీడిపప్పు, బాదంపప్పు నుంచి చికెన్, మటన్ వరకూ లాగించినవే. కానీ ఇప్పుడు లాకప్‌లో అన్నమో రామచంద్రా అంటూ గగ్గోలు పెడుతున్నాయి. ఈ కోడి పుంజులకు తిండి పెట్టలేక పోలీసులు నానా తంటాలూ పడుతున్నారు. దీనికంతటికీ గల కారణాలను పరిశీలిస్తే, 
 
సంక్రాంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు వేస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి 9 పుంజులను, ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న కోడిపుంజులను తీసుకెళ్లి న్యాయమూర్తి సమక్షంలో హాజరుపరిచారు. అయితే, నిందితులందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి విడుదల చేశారు. ఈ పుంజులతో పాటు మిగతా ప్రాంతాల్లోనూ అదుపులోకి తీసుకున్న కోడిపుంజులన్నింటినీ ఒకేసారి ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించడంతో వాటిని మళ్లీ వెనక్కు తీసుకువచ్చి, ఏం చేయాలో తెలియక, లాకప్‌లో ఉంచారు. ఇప్పుడు అచ్యుతాపురం స్టేషన్ లాకప్ నేరాలకు పాల్పడిన వాళ్లకు బదులుగా కోళ్లతో నిండిపోతోంది.