గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (16:17 IST)

నందిగామలో పోటీ చేసి.. ఉన్న పరువును కోల్పోయిన కాంగ్రెస్?

టీడీపీ ఎమ్మెల్యే హఠాన్మరణంతో ఈనెల 13వ తేదీన నందిగామ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ దివంగత తంగిరాల ప్రభాకర్ రావు కుమార్తె తంగిరాల సౌమ్యకే టిక్కెట్ కేటాయించగా, జగన్ నేతృత్వంలోని వైకాపా ఆది నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పాటించి ఉప ఎన్నిక పోటీకి దూరంగా ఉంది. 
 
కానీ, 125 యేళ్ల సుదీర్ఘ కలిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం సంప్రదానికి విరుద్ధంగా అభ్యర్థిని పోటీకి దించింది. విభజన కారణంగా ఆ పార్టీ సీమాంధ్రలో భూస్థాపితమై పోయినా.. చివరకు రాష్ట్ర నేతలకు కూడా బుద్ధి రాలేదు. అందుకే ఒక అభ్యర్థిని ఎంపిక చేసి ఎన్నికల్లో పోటీకి దించింది. దీంతో కాస్తో కూస్తో ఉన్న పరువును పోగొట్టుకుంది. 
 
అయితే, రాష్ట్ర నేతలు మాత్రం మరోలా సమర్థించుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం 100 రోజుల పరిపాలనపై ప్రజలివ్వబోయే తీర్పు ఇది అని చెపుతున్నారు. ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వానికి ఓటర్లు గట్టిగా బుద్ధి చెపుతారంటూ వారు జోస్యం చెపుతున్నారు. 
 
అంతేకాకుండా, సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక చతికిలపడిన కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కూడా లేకుండా పోయింది. రాష్ట్ర విభజన కారణంగా ప్రజలు తమపై చాలా ఆగ్రహంగా ఉన్నందునే తమకీ దుస్థితి ఏర్పడిందని వారికి తెలుసు. 
 
అయితే ఇదంతా జరిగి అప్పుడే మూడు నెలలైపోయింది కనుక ఇప్పటికైనా ప్రజలు తమ పార్టీపై మెత్తపడ్డారా లేదా? అనే సంగతి తెలుసుకొనేందుకే ఈ ఎన్నికలలో ఒక బాబురావును బకరాగా చేసి నిలబెట్టామని చెపుతున్నారు. ఒకవేళ ఆయన స్వంత కష్టంతోనో మరో రకంగానో ఈ ఎన్నికలలో నెగ్గితే ఇక కాంగ్రెస్ తన ఈ వాదనకు మరింత బలం చేకూరినట్టేనని వివరిస్తున్నారు.