శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2015 (12:24 IST)

బూతులు తిట్టే కేసీఆర్‌కు ఆహ్వానమా.. అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో..!?

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానించడంపై కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు స్థాయికి తగ్గట్టు వ్యవహరించట్లేదని దుయ్యబట్టారు. 
 
ఆంధ్రా ప్రజలను, నేతలను, చంద్రబాబును తెల్లారి నిద్ర లేచింది మొదలు బూతులు తిట్టే కేసీఆర్ దగ్గరకు స్వయంగా వెళ్లి ఆహ్వానించే ఏపీ సీఎంకు.. సొంత రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేతలు ఎందుకు కనిపించట్లేదని ప్రశ్నించారు. అయినవారికి ఆకుల్లోను, కానివారికి కంచాల్లోను పెట్టడం చంద్రబాబుకు బాగా అలవాటని ఆయన ఆక్షేపించారు.
 
సొంత రాష్ట్రంలో ఉంటే విపక్ష నేతలను ఏమాత్రం పట్టించుకోకుండా అమరావతి నిర్మాణానికి పక్క రాష్ట్రమైన తెలంగాణ సీఎంను ఆహ్వానించడం ఎంతవరకు సబబు అని ద్రోణం రాజు అడిగారు. ముందు రాజధాని నిర్మాణంలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయాలనేది చంద్రబాబు తెలుసుకోవాలని ఆయన సూచించారు. రాజధాని టీడీపీకి మాత్రమే సంబంధించిన అంశం కాదని, రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన విషయమని సీఎం గుర్తించాలని ద్రోణం హితవు పలికారు.