టీటీడీ నిర్మాణాల్లో అన్యమత ప్రచారం?.. శిలువకాదు.. అది ప్లస్ గుర్తే.. టీటిడి సిఈ
తిరుమలలో మరోమారు అన్యమత ప్రచార దుమారం చెలరేగింది. ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాల కారణంగా ఇతర మతాలకు సంబంధించిన పోలీకలు కలిగిన ఏ చిన్న ఆకృతి కనిపించినా శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనం వేధిక వద్ద మహామణి మండపం నిర్మాణ పనులలో భాగంగానే సిమెంట్ దిమ్మె పై క్రాస్ గుర్తును కలిగిన ఆకారాలు వెలిశాయి.
దీంతో భక్తులు ఆందోళనకు దిగే అవకాశం ఏర్పడింది. కొందరు హిందూ మత సంస్థలకు సంబంధించిన వ్యక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో టీటీడీ మరోమారు ఉలుక్కు పడింది. వెంటనే రంగంలోకి దిగి వివరణ ఇచ్చింది. ఇది శిలువ గుర్తు ఏ మాత్రం కాదని టిటిడి చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్రెడ్డి వివరణ ఇచ్చారు. ఆయన తిరుమలలోని తన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా భవనం లేదా నిర్మాణం చేపట్టే ముందు సివిల్ ఇంజనీరింగ్లో సెంట్రల్ లైన్ సిస్టం ప్రకారం ఒక కేంద్రీకృత స్థానం నుంచి నాలుగు మూలాలు అనుసంధానం అయ్యేలా ప్లస్ గుర్తును వేసుకుంటారని తెలియ చేశారు. ఇందులో భాగంగానే టిటిడి ఇంజనీరింగ్ సిబ్బంది నాదనీరాజనం వేదిక ముందు ప్లస్ గుర్తు వేశారని వివరించారు.