దాసరి బొబ్బిలి పులి కాదు.. బొగ్గుల పులి.. ఆస్తుల జప్తు!
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు తెల్ల చొక్కాకు బొగ్గు మసి అంటుకుంది. దేశంలో సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణంలో తనకు ఏమాత్రం ప్రమేయం లేదంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన దాసరికి.. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సోమవారం గట్టి షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన 2.25 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఆటాచ్మెంట్ చేసింది. దీంతో బొబ్బిలి పులి కాస్త బొగ్గుల పులిగా మారిపోయారు.
ఈ స్కామ్లో తవ్విన కొద్దీ... ఆయన వంటి నిండా మసే కనిపిస్తోంది. దాసరి నారాయణ... ఒకప్పుడు బొబ్బిలి పులి. కానీ ఇప్పుడో మసంటుకున్న బొగ్గుల మేస్త్రీ. కోల్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి. 2004 నుంచి 2008 వరకూ కేంద్ర బొగ్గుగనుల శాఖలో సహాయ మంత్రిగా పనిచేసిన ఆయన కోల్ స్కాంలో ఇరుక్కున్నారు. బొగ్గు కుంభకోణంలో దాసరి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ తేల్చేసింది. జిందాల్ కంపెనీ నుంచి క్విడ్ ప్రోకో రూపంలో తన కంపెనీలో పెట్టుబడులు పెట్టించినట్లు గుర్తించింది. ఇదే విషయాన్ని గతంలో బొగ్గుగనుల శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ ఓ పుస్తకం రాసి మరీ ధ్రువీకరించారు. దీంతో ఇప్పటికే పలుమార్లు నారాయణరావును సీబీఐ విచారించింది.
తాజాగా దర్శకరత్నకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సౌభాగ్య మీడియాకు చెందిన రూ.2 కోట్ల 25 లక్షల విలువైన ఆస్తులను జప్తు చేసింది. బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లు, రెండు వాహనాలు, ఇతర ఆస్తులను తాత్కాలికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. మనీ ల్యాండరింగ్ ద్వారా సౌభాగ్య మీడియాలోకి పెట్టుబడులు వచ్చాయన్నది ప్రధాన ఆరోపణ.
మరోవైపు దాసరి వాదన ఇంకోలా ఉంది. అటాచ్ అయినవి తన వ్యక్తగత ఆస్తులు కావని, సౌభాగ్య మీడియాలో తాను కేవలం వాటాదారుణ్ణి మాత్రమేనని నారాయణరావు స్పష్టం చేశారు. సౌభాగ్య మీడియా లిస్టెడ్ కంపెనీ అని... తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన అంటున్నారు. తనపై కుట్రజరుగుతోందని మేస్త్రీ వాపోతున్నారు. ఎప్పుడూ ధరించే తెల్ల దుస్తులకు అంటుకున్న బొగ్గు మసిని దాసరి తుడిచేసుకోగలరా? లేదా బొగ్గుల మేస్త్రీగానే చరిత్రలో నిలిచిపోతారా...? కాలమే నిర్ణయించాలి.