శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 26 జూన్ 2017 (01:06 IST)

60 గంటలపాటు శ్రమించి పాప అవయవాలు వెలికి తీశారు. అదే చైనాలో 2 గంటల్లో ప్రాణాలతో పైకి లాగారు. తేడా ఎక్కడ?

కడసారి చూపునకు కన్నతల్లిదండ్రులు నోచుకోలేదు. పాప బోరుబావిలో పడినప్పటి నుంచి పాపను క్షేమంగా మీకు అప్పగిస్తామని యంత్రాంగం ధైర్యం చెబుతూ వచ్చినా.. సాధ్యపడలేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఓఎన్‌జీసీ, సింగరేణి తదితర బృందాలు చేసిన విశ్వప్రయత్నాలు ఫలించలేదు. బోర్‌బావుల

కడసారి చూపునకు కన్నతల్లిదండ్రులు నోచుకోలేదు. పాప బోరుబావిలో పడినప్పటి నుంచి పాపను క్షేమంగా మీకు అప్పగిస్తామని యంత్రాంగం ధైర్యం చెబుతూ వచ్చినా.. సాధ్యపడలేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఓఎన్‌జీసీ, సింగరేణి తదితర బృందాలు చేసిన విశ్వప్రయత్నాలు ఫలించలేదు. బోర్‌బావుల తవ్వకాల్లో అనుభవం ఉన్న వ్యక్తుల సహాయమూ నష్టాన్ని నివారించలేకపోయింది. అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులను అమలు చేసినా.. కడుపుకోతే మిగిలింది. బోరుబావుల ప్రమాద సంఘటనల్లో కెల్లా అత్యంత కఠినమైన రెస్క్యూ అపరేషన్‌గా దీన్ని భావిస్తున్నారు.
 
చేవెళ్ల మొయినాబాద్‌ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో చిక్కుకున్న చిన్నారి ఘటన విషాదాంతంగా ము గిసింది. పాపను రక్షించాలని 60 గంటలపాటు నిర్విరామంగా సాగిన ఆపరేషన్‌.. సఫలీకృతం కాలేదు. ఏడాదిన్నరకే.. ఆ పాలబుగ్గల పాపకు నూరేళ్లు నిండడం ప్రతిఒక్కరినీ కలచివేసింది. పాప ఇక లేదన్న వార్తతో అందరి హృదయాలు ద్రవించిపోయాయి.  చిన్నారిని రక్షించాలని యంత్రాంగం సవాలుగా తీసుకుంది. ఈ మేరకు శక్తివంచన లేకుండా శ్రమించింది. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు రెస్క్యూ బృందం,  ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంధంగా వచ్చిన బోర్‌వెల్స్‌ యజమానులు ఎంతో కృషి చేశారు. 
 
60 గంటలపాటు సాగిన ఆ ఆపరేషన్‌.. అత్యంత క్లిష్టమైనదిగా యంత్రాంగం భావించింది.  గతంలో బోరుబావిలో పడిన చిన్నారులను ఒక్కటి రోజుల్లో రెస్క్యూ బృందాలు రక్షించాయి. కొన్ని ఘటనల్లో ప్రాణాలు పోయినా.. చివరకు మృతదేహాలనైనా బయటకు తీసేవి. కానీ చిన్నారి విషయంలో ఆ రెండూ సాధ్యపడలేదు. దాదాపు 260 అడుగుల లోతు వరకు హై ఫ్లషింగ్‌ చేయటంతో లోపల నుంచి నీటితోపాటు చిన్నారి డ్రెస్‌ రెండు ముక్కలుగా బయటకు వచ్చింది. ఆ తర్వాత పాప శరీర అవయవాలు కొన్ని బయటపడ్డాయి.
 
గతేడాది చైనాలో ఏకంగా 300 అడుగుల బోరుబావిలో అడుగున ఉన్న మూడేళ్ల బాలుడిని అక్కడి అధికారులు కేవలం రెండు గంటల్లోనే కాపాడి శెభాష్ అనిపించుకున్నారు. కానీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం బోరు బావిలో పడిన 18 నెలల చిన్నారి మీనాను శనివారం అర్ధరాత్రికి కూడా బయటకు తీయలేకపోయారు.

గతేడాది మార్చి 31న తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్, వీఫాంగ్ లో మూడేళ్ల బాలుడు స్నేహితులతో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అరగంటలో ఘటనాస్థలానికి రెండు ఫైరింజన్లు, 12 మంది సిబ్బంది చేరుకున్నారు. 11 ఇంచుల వెడల్పున్న బోరు బావిలో పడ్డ చిన్నారి 300 అడుగుల లోతులో ఉన్నాడని సెన్సార్ల ద్వారా గుర్తించారు. సెన్సార్లతో పాటు ఆక్సిజన్ పైపును, చిన్నారికి కట్టేందుకు ఇతరత్రా పైపులను సిబ‍్బంది బోరులోకి పంపారు.
 
సెన్సార్ల సాయంతో వారి వద్ద ఉన్న మానిటర్లో బాలుడి కదలికలను గుర్తించారు. ఆపై బాబు ముక్కుకు ఆక్సిజన్ పైపు సెట్ చేశారు. అత్యాధునిక సెన్సార్ల సాయంతో బాబుకు ఓ పైపు చుట్టుకునేలా చేశారు. తమ వద్ద ఉన్న స్క్రీన్లో చూస్తూ చిన్నారికి కట్టిన పైపుతో పాటుగా ఆక్సిజన్, సెన్సార్ పైపులను పైకి లాగడం ప్రారంభించారు. ఇలా జాగ్రత్తగా రెండు గంటలపాటు ఎంతో శ్రమించిన సిబ్బంది బాలుడికి ఎలాంటి గాయాలు అవకుండానే బోరుబావి నుంచి రక్షించారు. బాలుడి తల్లిదండ్రులతో పాటు ఘటనా స్థలంలో ఉన్న అందరూ ఈ అద్బుతాన్ని వీక్షించారు.
 
బాలుడి తండ్రి చెంగ్ ఫైర్ సిబ్బందికి ధన్యావాదాలు తెలిపాడు. అంత లోతైన బోరుబావిలో పడినా.. నా కుమారుడికి స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయి. అయితే భయంతో ఎంతోసేపు ఏడుస్తూనే ఉన్నాడని చెప్పాడు. అద్భుతమైన టెక్నాలజీని వినియోగించిన కారణంగానే సిబ్బంది తమ కుమారుడిని రక్షించగలిగారని ఆనందభాష్పాలతో చెప్పడం స్థానికులు ఎప్పటికీ మరిచిపోరు.

ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తే 300 అడుగుల లోతైన బోరు బావిలో పడిన చిన్నారుల ప్రాణాలను సైతం సులువుగా రక్షించవచ్చని చైనా వాసులు నిరూపించినా.. భారత్ లో మాత్రం 100 అడుగుల లోతైన బోరు బావిలో పడుతున్న చిన్నారులను రక్షించలేక పోవడం విచారకరమని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.