గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (14:00 IST)

మెదక్ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు గల్లంతే!

మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బిజెపి ఎంపి అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతేనని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌పై విశ్వాసం లేకపోవడంవల్లే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒక్క రొక్కరుగా జారుకుంటున్నారని అన్నారు. 
 
సోమవారం మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది కాంగ్రెస్‌, బిజెపి, టిడిపిలకు చెందిన కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. టిఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి వలసలు పెరగడంతో కాంగ్రెస్‌, బిజెపిలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయన్నారు.
 
కాంగ్రెస్‌ నుంచే కాకుండా టిడిపి నుంచి కూడా తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్‌ నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని హరీష్ రావు తెలిపారు. బంగారు తెలంగాణ కోసం కొండా సురేఖ, మహేందర్‌రెడ్డి, గోవర్ధన్‌లు టిఆర్‌ఎస్‌లో చేరారని పేర్కొన్నారు. 
 
సీమాంధ్ర ముఖ్యమంత్రులకు వత్తాసు పలికిన జగ్గారెడ్డి బిజెపిలో చేరారని దుయ్యబట్టారు. మెదక్‌ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి గెలవడం ఖాయమని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పడం మేకపోతు గాంభీర్యానికి నిదర్శనమన్నారు.
 
మరోవైపు లోక్సభ ఉప ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీచేస్తున్న తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి)కి మెదక్ స్థానంలో డిపాజిట్ కూడా రాదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. అక్కడ తమ సొంత పార్టీ తరఫున పోటీ చేయించడానికి అభ్యర్థి దొరక్క భారతీయ జనతా పార్టీ కిరాయి అభ్యర్థిని బరిలోకి దింపిందని ఆయన మండిపడ్డారు.