గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PYR
Last Modified: శనివారం, 24 జనవరి 2015 (08:05 IST)

సినిమా పక్కీలో విద్యార్థిని కిడ్నాప్ యత్నం..!

సినిమాలో కిడ్నాప్ సీన్ శుక్రవారం ధర్మవరంలో ఆవిష్కారమయ్యింది. నలుగురు వ్యక్తులు మంకీ క్యాప్ లు ధరించి.. సుమోలో వచ్చారు. ఓ విద్యార్థినిని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. విద్యార్థిని కేకలు వేయడంతో వారి ప్రయత్నం సఫలం కాలేదు. దీంతో పలాయనం చిత్తగించారు. వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలో ఉంటున్న శ్రీరామిరెడ్డి, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె స్రవంతి స్థానిక శ్రీసాయి మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

శుక్రవారం ఉదయం సోదరుడు భాస్కర్‌రెడ్డి స్రవంతిని కళాశాల వద్ద వదిలి వెళ్లాడు. కాసేపటి తర్వాత నోటు పుస్తకం కోసం ఉపాధ్యాయుల అనుమతి తీసుకుని కళాజ్యోతి వద్ద ఉన్న బుక్‌స్టాల్ వద్దకు బయలుదేరింది. అప్పటికే ఆ పరిసర ప్రాంతాలలో మకాం వేసిన దుండగలు నలుగురు మంకీ క్యాపులు ధరించి వాహనం మధ్య భాగంలోని డోర్‌ను తీసి స్రవంతిని బలవంతంగా చేయి పట్టుకుని సుమోలోకి లాగే ప్రయత్నం చేశారు.
 
స్రవంతి పెద్దగా కేకలు వేయడం పెనుగులాడడంతో అందరూ అటువైపు చూడడం, ఆపై విడిపించుకుంది. దీంతో భయపడిన దుండగులు సుమోను వేగంగా నడుపుకుంటూ వెళ్లిపోయారు. పెనుగులాటలో స్రవంతి చేతికి స్వల్ప గాయాలయ్యాయి. స్రవంతి సోదరుడు భాస్కరెడ్డిపై గత ఏడాది జరిగిన హత్యాయత్నం కేసులో మారుతి రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడన్నారు. వారితో తప్ప తమకు ఎవరితోనూ విభేదాలు లేవని ఫిర్యాదులో వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.