ఏం జగన్... కొత్త చట్టంతో పిచ్చెక్కుతోందా...? : మంత్రి ఉమామహేశ్వర రావు
అవినీతి కేసుల్లో పీకల్లోతుకు కూరుకుపోయిన జగన్కు కొత్తచట్టం పేరు చెబితేనే పిచ్చెక్కుతోందని ఏపీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. పట్టిసీమ, పోలవరం విషయంలో జగన్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పోలవరం పనులు చేస్తున్న ట్రాన్స్స్ట్రాయ్ కంపెనీకి పనులు అప్పగిస్తూ 2013లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలుసా? అని జగన్ను ప్రశ్నించారు. 2010లో ఈ పథకాన్ని చేపట్టాలని భావించినా.. అప్పట్లో ఈ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు వెనక్కు తగ్గిపోయిన విషయం గుర్తు లేదా? అని నిలదీశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చేంత వరకూ.. ఏడు ముంపు గ్రామాల్లో నాలుగింటిలో భూ సేకరణ, పరిహారం చెల్లింపును చేపట్టాకే పనులు వేగవంతం అయినట్లు తెలియదా? అని ప్రశ్నించారు. ఒప్పందంలోని నిబంధనల మేరకు 252 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి చేశాకే బ్యాంకు గ్యారెంటీ తీసుకుని 290 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సును ఇచ్చామని తెలియదా? అని ప్రశ్నించారు.