ఏపీలో యువరాజా వారి పెత్తనం.. జగన్ను అలా?: దేవినేని
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేష్పై కృష్ణా జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ ఫైర్ అయ్యారు. రాజధాని విషయంలో లోకేష్ అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
కొత్త రాజధాని నిర్మాణం జరిగే ప్రదేశంలో, లోకేష్ ముందుగానే వందలాది ఎకరాల భూములు కొనిపెట్టుకున్నాడని ఆరోపించారు. వీటి ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలని చూస్తున్నాడని విమర్శించారు.
ఒకే వ్యక్తి నుంచి 125 ఎకరాల భూమిని కొన్నట్లు తన దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. విజయవాడ సమీపంలో లోకేశ్ భూములకు సంబంధించిన రికార్డులను తాను సేకరిస్తున్నానని, త్వరలో విజయవాడలో బహిరంగసభ ఏర్పాటు చేసి మరీ రుజువులతో వివరాలన్నీ బయటపెడతానన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాల్లో 'యువరాజా' వారి పెత్తనం ఎక్కువైపోయిందని అన్నారు. చంద్రబాబును ఏదైనా పని నిమిత్తం కలవాలంటే 'యువరాజు' అనుగ్రహం ఉండాల్సిందేనన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వ వ్యవహారాల్లో వేలు పెట్టడం తానెన్నడూ చూడలేదన్నారు.