బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (16:39 IST)

రాజధానిపై తలోమాట - తలోబాట :: రైతులకు అండగా ఉంటాం .. దేవినేని ఉమ

ప్రజా రాజధాని అమరావతి రైతులకు అండగా ఉంటామని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు. సోమవారం ఆయన నందిగామలో రిటైర్డ్ ఎంఈఓ శాఖమూరి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. మదర్ థెరిస్సా 109వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 
 
అనంతరం మీడియా సమావేశంలోనూ దేవినేని ఉమా మాట్లాడుతూ, రాజధాని అమరావతిపై మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని, కొందరు నాయకులు తలోబాట పడుతున్నారని ఆరోపించారు. 34 వేల ఎకరాలను లాభాపేక్ష లేకుండా ప్రజా రాజధాని అమరావతి కొరకు రాజధాని ప్రాంత రైతులు త్యాగం చేస్తే, వారి త్యాగాలను వొమ్ము చేసేందుతు వైకాపా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
 
రాజధాని శంకుస్థాపనకు కూడా హాజరుకాని వైయస్ జగన్ ఇప్పుడు రాజధానిని దొనకొండకో, ఇడుపులపాయకో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ అహర్నిశలు అండగా ఉండి, వారి కోర్కెకల కోసం ఉద్యమిస్తున్నట్లు చెప్పారు.
 
వంద రోజుల వైయస్ జగన్ పరిపాలనలో చేసిందేమీ లేదని, ఇసుక రద్దు చేసి లక్షలాది మంది భవననిర్మాణ కార్మికులను రోడ్డున పడేసారని, అన్న క్యాంటీన్లను మూసేసి దాదాపు కోటిమంది అభాగ్యుల పొట్ట కొట్టారని విమర్శించారు. 
 
తెలుగుదేశం పార్టీ నాయకులు కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని దేవినేని ఉమా సూచించారు. గ్రామాల్లో కలతలు లేకుండా పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని, తద్వారా చంద్రబాబు కలలను సాకారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.