గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (16:47 IST)

కరెంట్ ఇస్తామంటే హరీష్ రావు స్పందించలేదు : దేవినేని

తెలంగాణ రాష్ట్ర ప్రజల కరెంట్ కష్టాలు తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వెల్లడించారు. అయితే, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు, పట్టీపట్టనట్టు నడుచుకున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు రెండూ కలసి రైతుల కష్టాలను తీర్చాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమన్నారు. కృష్ణా జలాలను కాపాడుకుంటూ రైతులను ఆదుకోవాలన్నారు. 
 
శ్రీశైలం జల విద్యుదుత్పత్తిని నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు నల్గొండలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. 
 
ఈ ఘటనను మీడియా ముఖంగా ఖండించిన మంత్రి, విద్యుత్ అంశంపై తాను మంత్రి హరీశ్ రావుకి ఫోన్ చేసి అడిగినా ఇంతవరకు స్పందన రాలేదన్నారు. పక్క రాష్ట్రాలు విద్యుత్ ఇస్తామంటున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని, తెలంగాణకు విద్యుత్ ఇవ్వడానికి మా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని ఉమ చెప్పారు.