దావోస్, సింగపూర్, జపాన్ పర్యటనల పేరుతో చంద్రబాబు మోసం : ధర్మాన
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనల పేరుతో కాలయాపన చేస్తూ, ప్రజలను మోసం చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మోసపూరిత విధానాలను ఏలుగెత్తి చాటేందుకే తమ పార్టీ అధినేత జగన్ రెండురోజుల పాటు దీక్ష చేపడుతున్నారన్నారు.
మోసపూరిత హామీల పరంపరతో అధికారంలోకి వచ్చి.. ఆనక రైతులను, డ్వాక్రా మహిళలను, అన్నివర్గాల ప్రజలను వంచనకు గురిచేస్తున్న చంద్రబాబు తీరు, సర్కారు విధానాలపై సమరశంఖం పూరించేందుకు వైఎస్ జగన్ తణుకులో రైతు దీక్షకు శ్రీకారం చుడుతున్నారన్నారు. రైతుల వెంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని, ప్రధాన ప్రతిపక్షంగా సమర్థవంతమైన పాత్ర నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రైతులకు, ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం సహించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.