శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 28 మే 2017 (11:09 IST)

ఎర్ర స్మగ్లర్ల కోసం కొత్త దళం... అక్రమ రవాణా నిరోధక సేవల్లోకి ‘శునక’ దళం

ఎర్ర స్మగ్లర్లను అటకట్టించేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు. దీంతో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. ఈ పరిస్థితిలో స్మగ్లర్

ఎర్ర స్మగ్లర్లను అటకట్టించేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు. దీంతో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. ఈ పరిస్థితిలో స్మగ్లర్ల ఎత్తుగడలకు ధీటుగా స్పందించేందుకు పోలీసుశాఖ కొత్తగా శునక దళాన్ని రంగంలోకి దించింది.
 
ప్రస్తుతం 6 శునకాలు కడప, తిరుపతిలో సేవలందిస్తున్నాయి. లాబ్రిడార్‌, జర్మన్‌ షెపర్డ్‌, బెల్జియం మెలినాయిస్‌ తదితర జాతుల కుక్కలు వీటిలో ఉన్నాయి. వీటికి ఏడాది పాటు హైదరాబాద్‌లోని పోలీసు నిఘా శిక్షణ కేంద్రంలో ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. వీటిని ఎర్ర స్మగ్లర్లను పట్టుకునేందుకు రంగంలోకి దించనున్నారు.
 
అలాగే, హైదరాబాద్‌-తిరుపతి, కడప-అనంతపురం, కడప-రాపూరు-నెల్లూరు.. ఇలా పలు మార్గాల్లో సుమారు 20కి పైగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటుచేసి ఒక్కో కేంద్రం వద్ద 20 మంది వరకు సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ వాహన తనిఖీలతో రహదారులపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు శునక దళాన్ని రంగంలోకి దించారు.
 
వాహనంలోని ఇతర సరకుల మధ్య ఉండే దుంగలను ఈ కుక్కలు వాసన చూసి క్షణాల్లో పసిగడుతున్నాయి. దీంతో తనిఖీలు సులభతరంగా మారాయి. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి శునక దళం సహా డ్రోన్‌ కెమెరాలు, రోడ్లపై హైసెక్యూరిటీ స్కానర్లు, అడవిలోకి వెళ్లేందుకు ఆల్‌టెరైన్‌ వాహనాలు సమకూర్చాలని పోలీసుశాఖ ప్రతిపాదనలు చేసింది. అందులో ప్రస్తుతం డాగ్‌స్క్వాడ్‌ ఏర్పాటు కావడం పట్ల పరిరక్షణ దళాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
 
‘‘ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడిలో డాగ్‌స్క్వాడ్‌ ప్రధాన భూమిక పోషిస్తుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ తరహాదళం ఏర్పాటైంది. వీటి సేవలతో సిబ్బంది సమస్యలకు చెక్‌ పెట్టడానికి అవకాశం ఏర్పడింది’’ అని కడప ఆపరేషన్స్‌ ఏఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు.