శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 జులై 2015 (19:18 IST)

నిరుపేదల పేరిట అర్చన.. లడ్డూ అంటే కలాంకు ఇష్టం: డాలర్ శేషాద్రి

దివంగత శాస్త్రవేత్త, డాక్టర్ అబ్దుల్ కలాం గురించి ఓఎస్డీ డాలర్ శేషాద్రి తన అనుభవాన్ని పంచుకున్నారు. కలాం తిరుమల వచ్చినప్పుడల్లా తనను తమిళంలోనే ఆప్యాయంగా పలకరించేవారని.. ఆర్భాటాలకు పోకుండా సామాన్య భక్తుడిలా ఆలయానికి వచ్చేవారని చెప్పారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కలాంకు అత్యంత ప్రీతిపాత్రమంటూ... ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ వకుళమాత దర్శనం చేసుకుని, హుండీలో కానుకలు సమర్పించేవారన్నారు.
 
రాష్ట్రపతి హోదాలో కలాం  2003లో శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చారని.. శ్రీవారి దర్శనానంతరం కలాం నిరుపేదల పేరిట అర్చన చేయించాలని కోరి రూ.400 టీటీడీకి చెల్లించి సాధారణ పౌరుడిలా రశీదు తీసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత అర్చనా సేవా టికెట్లను రాష్ట్రపతి భవన్‌కు పంపించామన్నారు.

రాష్ట్రపతి హోదాలో కలాం తిరుపతికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు కానీ, టీటీడీ ఆయనకు కేటాయించిన తేదీల్లోనే శ్రీవారి దర్శనానికి రావడం ఆయన భక్తిప్రపత్తులకు నిదర్శనమని కొనియాడారు. 2009లో మాజీ రాష్ట్రపతిగా మరోసారి తిరుమల వచ్చి నిరుపేదల కోసం ఆయన అర్చన చేయించారని శేషాద్రి గుర్తుచేసుకున్నారు.