చిరంజీవి, పవన్ కల్యాణ్లను చీల్చి చెండాడిన డాక్టర్ సమరం, పవన్కు సీన్ లేదు...
విజయవాడ : దేశాన్ని నేడు కుల, ధన, మత స్వార్ధ రాజకీయాలు పట్టి పీడిస్తున్నాయని ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కుల రాజకీయాలు చేస్తూ, సిగ్గు లేకుండా లక్షల కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. విజయవా
విజయవాడ : దేశాన్ని నేడు కుల, ధన, మత స్వార్ధ రాజకీయాలు పట్టి పీడిస్తున్నాయని ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కుల రాజకీయాలు చేస్తూ, సిగ్గు లేకుండా లక్షల కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికార పార్టీది ఓ కులం, ప్రతిపక్ష పార్టీది ఓ కులం... ఇక బీజేపీ మత రాజకీయం... ఇవేం రాజకీయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడు కొత్తగా వస్తున్న పవన్ కల్యాణ్ కూడా జనసేన ద్వారా ఏమీ సాధించలేడన్నారు.
చిరంజీవితో తనకు 15 సంవత్సరాల పరిచయం ఉందని, ఈ కులాలేంటి, ఈ రాజకీయాలేంటి అని బోలెడు మాటలు చెపితే, నిజమే అనుకుని ప్రజారాజ్యంలో చేరానని డాక్టర్ సమరం చెప్పారు. తీరా రాజకీయాల్లోకి వచ్చాక ముంచేశాడన్నారు. ప్రజల పార్టీ రావాలని ప్రజారాజ్యం పెట్టారు... ఫ్యాన్స్ ఆ రోజుల్లో చిరుకు కోసం ప్రాణం ఇచ్చేవారు. కానీ, ప్రజారాజ్యం పెట్టాక జంప్ జిలానీలను, స్వార్ధపరులు చేరి చిరును హైజాక్ చేసి పార్టీని నాశనం చేశారన్నారు.
ఎమ్మెల్యేకి 3 కోట్లు, పార్టమెంటు సీట్లకు 6 కోట్లు అడిగారట. నేను దేశంలోని ప్రముఖ డాక్టర్లు 50 మంది లిస్టు ఇస్తే, వారినీ డబ్బు అడిగారట. అయినా చిరంజీవికి శక్తిసామర్ధ్యాలు సరిపోలేదు, రాజకీయం చేత కాలేదని సమరం చెప్పారు. చిరంజీవి టీడీపీలోకి వస్తాడంటే ఆశ్చర్యంగా ఉందని, ఇది పక్కా అవకాశవాదం అన్నారు. వారికి కావాల్సింది పదవి, దాని వల్ల వచ్చే లాభాలు. దాని కోసం ఏదైనా సిగ్గు లేకుండా చేసేస్తారన్నమాట. ఈ విధమైన రాజకీయాలు తప్పు అని హితవు చెప్పారు... డాక్టర్ సమరం.
స్టేజీపై పవన్ కల్యాణ్ ఒక్కడేనా... రాచరికమా ఇది?
జనసేన పార్టీలో పవన్ కల్యాణ్ ఒక్కడే నాయకుడని, ఆయనే సేనాని, స్టేజీపై ఒక్కడే ఉంటాడు. ఇంకో మనిషి కనిపించడు. ఆర్గనైజేషన్ అంటే వ్యక్తుల కూటమి. ఇదేమైనా రాచరికమా? అని డాక్టర్ సమరం ప్రశ్నించారు. సినిమాలాగ వస్తాడు, మాట్లాడతాడు. తర్వాత కనిపించడు... ఇదో డ్రామా. ఈ రకంగా పవన్ కల్యాణ్ చేసే రాజకీయం హిట్ కాదు. ఆవేశం కాదు... ప్రశ్నలు కాదు. అలా అయితే వంద ప్రశ్నలు పవన్ కల్యాణ్నే వేయాల్సి ఉంటుంది.
అయినా, చిరంజీవి మాటలకే పరిమితం... పవన్ కల్యాణ్ ఆవేశానికే పరిమితం అని సమరం తేల్చి చెప్పారు. రాజకీయాల్లో ఆవేశం పనికిరాదు. చిరంజీవి ప్రజారాజ్యం సమయంలో ఆయన కులం వారు 95 పర్సంట్ ఆయనతో ఉన్నారు. కానీ, అప్పుడే ఆయనకు ఓట్లు సరిగా పడలేదు. ఇపుడు పవన్ వెనుక అంతమంది లేరు. ఫ్యాన్స్ ఊరికే అరవడానికి వస్తారు. సామాజిక వర్గం అయన వెనుక లేరు... కుల రాజకీయం తప్పు అని సమరం హితవు పలికారు.