గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 జులై 2017 (14:20 IST)

అలోవెరా జ్యూస్ తాగి కడుపు ఖాళీ చేస్తున్నారట.. డోపింగ్ టెస్ట్ తప్పదంటున్న సిట్

హైదరాబాద్‌ మత్తుమందు దందాలో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట విచారణకు హాజరవుతున్న సినీ ప్రముఖులు అలోవెరా (కలబంద) జ్యూస్ తాగి విచారణకు వస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వీరికి డోపింగ్

హైదరాబాద్‌ మత్తుమందు దందాలో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట విచారణకు హాజరవుతున్న సినీ ప్రముఖులు అలోవెరా (కలబంద) జ్యూస్ తాగి విచారణకు వస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వీరికి డోపింగ్ టెస్టులు చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
డ్రగ్స్ స్కామ్‌పై‌ సాగుతున్న విచారణలో భాగంగా, గడచిన రెండు మూడు రోజులుగా ఎక్సైజ్ శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి. వీటికి పుల్‌స్టాప్ పెట్టేందుకు అధికారులు ఉపక్రమించారు. ఇందులోభాగంగా, డోపింగ్ టెస్ట్ కోసం అనుమతివ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఇదేవిషయాన్ని మంగళవారం ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆర్‌.వి.చంద్రవదన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌లు సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కొన్ని విషయాలు వెల్లడించారు. 
 
టాలీవుడ్‌లోని కొంత మందిని విచారించామని, వీరిలో కొంత మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అనుమానాలు రాకుండా ఉండేందుకు అలోవెరా పానీయాన్ని సేవించి కడుపును ఖాళీ చేసుకుని వస్తున్నారన్నారు. హైదరాబాద్ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని, దీన్ని నిర్మూలించాలన్న ఉద్దేశ్యంతోనే విచారణ చేపట్టామని, కానీ ఎవరిపై కక్ష లేదని, వ్యక్తిగత ద్వేషం అసలే లేదన్నారు. 
 
ఒలింపిక్‌లో డోపింగ్ టెస్ట్ చేసే మిషన్‌లను రాష్ట్రానికి తీసుకు రావాలని భావిస్తున్నామని, ఇందుకు ప్రభుత్వం అనుమతిస్తే తీసుకు వచ్చి టెస్ట్‌లు నిర్వహించి ఎవరెంత మేర డ్రగ్స్ తీసుకున్నారన్న అంశాలను బహిర్గతం చేస్తామన్నారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి.