మద్యం మత్తుతో కన్నకొడుకునే చంపేసిన కసాయి తండ్రి!
విశాఖ జిల్లా పెదవాల్తేర్ రామలక్ష్మి అపార్ట్మెంట్స్ సమీపంలో సోమవారం మద్యం మత్తులో ఓ తండ్రి కన్నకొడుకునే కడతేర్చాడు. తాపీ పనిచేసే శెట్టిబలిజ వీధికి చెందిన అగురు నూకరాజుకు ఇద్దరు కుమారులు.
మద్యానికి బానిసైన నూకరాజు ప్రతిరోజు భార్యాపిల్లలను హింసిస్తుండగా అతని భార్య కూలిపని, పాచిపనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నది. ఎప్పటిలాగానే సోమవారం ఉదయం నుంచే మద్యం తాగి ఉన్న నూకరాజు మధ్యాహ్నం తాగుడు కోసం ఇంట్లోని వస్తువులను పట్టుకుని వెళ్లడానికి పూనుకున్నాడు.
దీంతో భార్య, పెద్ద కుమారుడు సాయికుమార్ (14) అడ్డుకోగా వారి ఘర్షణ జరిగింది. భార్యను తన్ని దూరంగా తోసేశాడు. కొడుకు అడ్డుతప్పుకోకపోవడంతో దగ్గర్లో వున్న చాకు తీసుకుని అతడి పొట్టలో మూడుసార్లు పొడిచాడు. దాంతో కుమారుడు మృతి చెందాడు.
చుట్టుపక్కల వారి ఫిర్యాదుతో ఎంవీపీ జోన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.