శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 జులై 2015 (13:05 IST)

గోదావరి తల్లికి కాగానే కృష్ణమ్మకు పుష్కర కళ వచ్చేస్తుందోచ్!

గోదావరి పుష్కరాలు నాలుగో రోజుకు చేరుకున్న నేపథ్యంలో వచ్చే ఏడాది కృష్ణమ్మ పుష్కరాలకు సిద్ధం కానుంది. వచ్చే ఏడాది ఇదే సమయానికి కృష్ణమ్మకు పుష్కర శోభ వస్తుంది. గోదావరి తల్లికి కాగానే కృష్ణమ్మకు పుష్కర ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే సర్కారు చర్యలు మొదలెట్టేయాలని భావిస్తోంది. రాజమండ్రి ఘటన పునరావృత్తం కాకుండా తగిన చర్యలు తీసుకునేందుకు సర్కారు చర్చలు జరుపుతోంది. 
 
ఎక్కడో పడమటి కనుమలలో ఉన్న మహాబలేశ్వర్‌కు ఉత్తరంగా మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించి, అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‍లలో లక్షలాది ఎకరాల పంటను సస్యశ్యామలం చేస్తూ, 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. 
 
ఈ నేపథ్యం గల కృష్ణానదికి గురుడు కన్యారాశిలో ప్రవేశించే శుభ ముహూర్తాన  పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తారు. ఆ పుష్కర ఘడియలు వచ్చే ఏడాది రానున్నాయి. కృష్ణా పుష్కరాలు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, సంగమేశ్వరం, మహబూబ్ నగర్ జిల్లా అలంపురం, తెలంగాణ, ఏపీల సరిహద్దుల్లోని నాగార్జున సాగర్, నల్గొండ జిల్లాలోని మట్టపల్లి, గుంటూరు జిల్లాలోని సత్రశాల, అమరావతి, నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం, కృష్ణా జిల్లాలోని విజయవాడ తదితర ప్రాంతాల్లో వైభవంగా జరగనున్నాయి. 
 
కాగా.. గోదావరి పుష్కరాలు ముగియగానే.. ఏపీ సర్కారు కృష్ణా పుష్కరాలపై దృష్టి పెట్టనుంది. ఈ నెలాఖరులో విజయవాడలో కృష్ణా పుష్కరాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. జూలై 2016లో జరిగే కృష్ణా పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన నివేదిక సిద్ధం చేయమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.