వెలక్కాయనకుని.. నాటుబాంబు నమిలిన ఏనుగు...! అక్కడికక్కడే మృతి..!!
అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబు.. ఓ ఏనుగుపిల్ల ప్రాణం తీసింది. వెలక్కాయనుకుని బాంబును నమిలిన ఏనుగు పిల్ల అక్కడికక్కడే మరణించింది. రెండు రోజుల కిందట జరిగిన విషాదమిది. చిత్తూరు జిల్లా యర్రవారిపాళెం మండలంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఆహారం, నీళ్లు దొరక్క ఏనుగులు ఆ పక్కనే ఉన్న పంటపొలాలపై పడుతున్నాయి. తలనకోనకు సమీపంలోని నెరబైలు ప్రాంతంలో రైతులు, వేటగాళ్ళు వాటిని పారద్రోలడానికి, వేటడడానికి రెండింటికీ నాటుబాంబులను వినియోగిస్తున్నారు.
ఈ క్రమంలో నెరబైలు రెవెన్యూ పరిధిలోని మామిడి తోట సమీపంలో ఉంచిన ఒక నాటుబాంబును ఓ ఏనుగు నమిలేందుకు ప్రయత్నించింది. దీంతో బాంబు పేలింది. ఏనుగు అక్కడికక్కడే చనిపోయింది. కళేబరం నుంచి కుళ్లిన వాసన రావడం చూస్తే.. రెండు రోజుల కిందటే చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.