మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 మే 2015 (12:29 IST)

మహాభారత కాలం నాటి మర్రిచెట్టు: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను..?

ఆ మర్రిచెట్టుకు సుమారు 5వేల ఏళ్లు. అది మహాభారత కాలం నాటిదని విశ్వాసం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ చెట్టు కిందే భగవద్గీతను బోధించారని కూడా భక్తులు విశ్వసిస్తారు. ఈ చెట్టు వయసు సుమారు 5 వేల ఏళ్లు పైమాటేనని పరిశోధకులు సైతం తేల్చడంతో దీన్ని కాపాడేందుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) నడుం బిగించింది. 
 
హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర సమీపంలోని జ్యోతిసర్‌లో ఉన్న ఈ చెట్టు మాత్రమే మహాభారత కాలం నుంచి జీవించి ఉన్న ఏకైక ఆధారమని భావిస్తున్న ఎన్జీటీ, చెట్టు ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తూ, దాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను గురించి వివరించాలని కురుక్షేత్ర డిప్యూటీ కమిషనర్‌కు నోటీసులు పంపింది. ఈ మర్రి చెట్టు నెమ్మదిగా అంతరిస్తోందంటూ ఇప్పటికే పలు ఎన్జీవో సంఘాలు కోర్టులను ఆశ్రయించి వున్నాయి. 
 
భక్తులు తమ కోరికలు తీరాలని ఆశిస్తూ, చెట్టుకు దారాలు కట్టడం, వివిధ రకాల గంటలను కొమ్మలకు వేలాడదీయడం చెట్టు ఎదుగుదలకు అడ్డంకిగా మారిందని వివరించారు. ఈ చెట్టును భావి తరాలకు అందించే చర్యలు చేపట్టాలని కోరారు.