ఫేస్బుక్ పరిచయం... పెండ్లి చేసుకోమన్నందుకు కడతేర్చిన ట్యాక్స్ కన్సల్టెంట్
ఫేస్బుక్ పరిచయం మరో యువతి ప్రాణం తీసింది. పెళ్ళి చేసుకోమన్నందుకు ఆ యువతిని కడతేర్చాడు. ఆ తర్వాత ఆమె ధరించిన ఆభరణాలు దోచుకుని మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచీలో పెట్టి మూసీనదిలో పడేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరో కాదు.. ట్యాక్స్ కన్సల్టెంట్. హైదరాబాద్, చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
మలక్పేట ప్రాంతానికి చెందిన మల్లేశ్ యాదవ్ కూతురు జానకి (26) వృత్తిరీత్యా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తోంది. ఆమెకు ఏడాది క్రితం నల్లగొండ జిల్లా పెద్దకాపర్తికి చెందిన యశ్వంత్గౌడ్ (27)తో ఫేస్బుక్లో పరిచయమైంది. ఆ పరిచయం ఇద్దరూ ఏకాంతంగా కలుసుకొనేంత వరకూ వెళ్లింది. యశ్వంత్గౌడ్ ఎంబీఏ పూర్తిచేసి ప్రస్తుతం నాగోల్లో ఉంటూ ట్యాక్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు.
జానకిని ప్రేమిస్తున్నాని నమ్మించి, ఆమె వద్ద డబ్బులన్నీ కాజేశాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ జానకి ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమెకు దూరమయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గ్రహించిన జానకి... పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. పోలీసు స్టేషన్కు వెళితే చిక్కులు తప్పవని భావించిన యశ్వంత్.. జానకితో సన్నిహితంగా ఉన్నట్టు నటించడం ప్రారంభించాడు.
ఈ క్రమంలో ఈనెల 17న ఆమెతో సన్నిహితంగా మాట్లాడిన యశ్వంత్ తన గదికి తీసుకెళ్లాడు. గదిలో దారుణంగా హత్యచేసి, ఆమె ఒంటిపైనున్న బంగారు నగలు తీసుకొని, మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచి, అర్థరాత్రివేళ గౌరెల్లి సమీపంలో మూసీనదిలో పడేశాడు. జానకి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మొదటిసారి తనకేమీ తెలియదన్న యశ్వంత్ రెండోసారి అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించాడు.
జానకి కాల్ డేటా, ఆమె ఫేస్బుక్ అకౌంట్, మెయిల్స్, వాటిలో వీరిద్దరి సంభాషణ ఆధారంగా నిందితుడు యశ్వంతేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆదివారం మూసీ నది నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిమిత్తం దవాఖానకు తరలించామని, యశ్వంత్ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.