గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (11:09 IST)

ఐ లవ్ యూ డాడీ అంటూ రిషికేశ్వరి మెసేజ్: ఫ్రెషర్స్ రోజే అసభ్యకరంగా..?

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీల్లో సీనియర్ల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బీటెక్ విద్యార్థి రిషికేశ్వరి ఘటనకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నేటి ఉదయం రిషికేశ్వరి తల్లిదండ్రులు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావును విజయవాడలో కలిశారు.

ఈ సందర్భంగా ఆత్మహత్యకు ముందు రిషికేశ్వరి ‘ఐ లవ్ యూ డాడీ’ అంటూ తనకు పెట్టిన మెసేజ్‌ను ఆమె తండ్రి మంత్రికి చూపించి కన్నీరు పెట్టుకున్నారు. తమ కూతురు ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రిషికేశ్వరి తల్లిదండ్రులు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
 
మరోవైపు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రిమాండ్ డైరీలో పలు అంశాలు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ప్రెషర్స్ డే నాడే రిషికేశ్వరితో సీనియర్లు అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. సమాచారం మేరకు..., ప్రెషర్స్ డే (మే 18) నాడే రిషికేశ్వరిని శారీరకంగా, మానసికంగా వేధించారు. ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారు.
 
ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చిత్రహింసలు పెట్టారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. వేధింపులను రిమాండ్ డైరిలో వివరించారు. రిషికేశ్వరి తన పైన సీనియర్స్ చేసిన అరాచకాలను తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయింది. బాగా కుంగిపోయింది.

జూలై 14వ తేదీన రూమ్మెట్స్ సుజాత, కుసుమలత బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుంది. వారు వచ్చేసరికి ఆమె ఫ్యాన్‌కు వేలాడుతోంది. వారు గదికి వచ్చి ఆమెను చూసి, వెంటనే మధ్యాహ్నం 2.36 గంటలకు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే రిషికేశ్వరి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.