మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు మృగాళ్లు అరెస్టు..!
సభ్య సమాజం తలదించుకునే రీతిలో బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో రెచ్చిపోయిన మృగాళ్లు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వరంగల్ జిల్లాలోని చేర్యాలలో తన సోదరుడు పిలుస్తున్నాడని చెప్పిన మాయగాడి మాటలు నమ్మి నిందితుడి బైక్ పై ఎక్కిన బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టారు. బాలికను బైక్ పై ఎక్కించుకున్న యువకుడు, ఆమెను పట్టణం శివారుకు తీసుకెళ్లి మరో ఐదుగురితో కలిసి సామూహిక అత్యాచారం జరిపాడు.
ఆ సమయంలో బాలిక అరుపులు విని అటువైపుగా వెళుతున్న వారు కొందరు అక్కడికి చేరుకుని నిందితులను పట్టుకున్నారు. అనంతరం వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో గాయపడిన బాలికను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.