శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 11 మార్చి 2015 (17:34 IST)

శేషాచల అడవుల్లో గ్యాంగ్ వార్.. ఒక ఎర్రచందనం కూలీ హత్య

ఎర్రచందనం స్మగ్లింగు గ్యాంగుల మధ్య తగాదులు ముదురు పాకాన పడుతున్నాయి. స్మగ్లింగు చేయడంలో పోటీ పడుతున్న గ్యాంగులు ఒకరిపై ఒకరు పట్టు సాధించడానికి హత్యలకు దిగుతున్నారు. అటవీ ప్రాంతంలో గ్రామాలు వీరి చేష్టలతో భయాందోళనకు గురవుతున్నారు. తమిళనాడు నుంచి వస్తున్న స్మగ్లర్లు స్థానిక స్మగ్లర్లపై విరుచుకు పడుతున్నారు. తిరుపతి సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన గ్యాంగ్ వార్ లో ఎర్రచందనం స్మగ్లర్ ఒకరు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. 
 
రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామం శేషాచల కొండలకు ఆనుకునే ఉంటుంది. తమిళనాడు నుంచి వచ్చిన కొందరు ఎర్రదొంగలు, స్థానికంగా ఉన్న కొందరు స్మగ్లర్లకు మధ్య గ్యాంగు వార్ జరిగింది. ఎర్రచందనం లిఫ్టింగులో పోటీ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. అనంతరం ఒకరిపై ఒకరు కలియబడ్డట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడు చెందిన గ్యాంగ్ స్థానిక గ్యాంగ్ ను తరిమి తరిమి కొట్టింది. 
 
ఈ సమయంలో వెంకటాపురం గ్రామం అల్లిమిట్టకు చెందిన జమాల్ బాషా అనే ఎర్రచందనం కూలీ తమిళనాడు ఎర్రగ్యాంగు చేతికి చిక్కాడు. అతని కొట్టి చంపారు. శరీరమంతా రాళ్ళ గాయాలే ఉన్నాయి. అయితే అనంతరం గ్రామ సమీపంలో శవాన్ని పడేసి వెళ్ళిపోయారు. అయితే అతనిని ఏనుగులు తొక్కి చంపేసినట్లు పుకార్లు పుట్టించారు. అయితే శరీరమంతా రాళ్లు దాడులే ఉండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేశారు. ఎర్రగ్యాంగుల మధ్య వార్ దిశగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు.