శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (20:06 IST)

కేసీఆర్.. ఓ సీఎంగా వ్యవహరించడం లేదు.. : ఏపీ మంత్రి గంటా

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఒక సీఎంగా వ్యవహరించడం లేదని, ఇంకా ఉద్యమనేతగానే ప్రవర్తిస్తున్నారని ఏపీ విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి, అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏపి ఉన్నత విద్యామండలికి సంబంధించిన ఎస్‌బిహెచ్ ఖాతాలను తెలంగాణ ప్రభుత్వం స్తంభింపజేసిందని అన్నారు.
 
అంశంపై కోర్టును ఆశ్రయించి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితోపాటు బ్యాంకు వ్యవహార శైలిపై అక్కడే తేల్చుకుంటామని మంత్రి గంటా హెచ్చరించారు. తమ శాఖ నిర్వహిస్తున్న ఖాతాను ఫ్రీజ్ చేసిన ఎస్‌బిహెచ్‌పై పరువు నష్టం దావా కూడా వేస్తామన్నారు.
 
ఇకపోతే ఫాస్ట్ పథకం అమలుపై తెలంగాణ సర్కారుకు కోర్టు చెంప పెట్టులా మారినా వారి వైఖరిలో మార్పు రాకపోవడం దురదృష్టకరమని గంటా అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా ఉద్యమకారుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.