శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (19:05 IST)

'శ్రీమంతుడు'కెళ్లా... మరి మీ జబర్దస్త్ ప్రోగ్రాం సంగతేంటి రోజా... ఆ విద్యార్థిని వీడియోలప్పుడేం చేశారు...

అసెంబ్లీలో రిషితేశ్వరి ఆత్మహత్య అంశంపై వైకాపా ఎమ్మెల్యే మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఫైర్ అయ్యారు. నాగార్జున వర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న తర్వాత నాలుగు రోజులకు మంత్రి గంటా శ్రీనివాసరావు తీరిగ్గా వెళ్లి ఓ ప్రెస్ మీట్ పెట్టేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఆ మరుసటి రోజే కేసు సంగతి ఏమైందని కూడా చూడకుండా దర్జాగా శ్రీమంతుడు సినిమా ఆడియో ఫంక్షన్‌కు హాజరైన మంత్రిగారికి మహిళల భద్రత పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందని విమర్శించారు.
 
రోజా వ్యాఖ్యలపై మంత్రి గంటా శ్రీనివాసరావు బదులిస్తూ, శ్రీమంతుడు సినిమా నిర్మాతలు తనకు మిత్రులన్నారు. శ్రీమంతుడు ఊరును దత్తత తీసుకోవడం అనే సోషల్ కాన్సెఫ్ట్‌తో తెరకెక్కిందని తెలుసుకుని కావాలనే ఆ ఫంక్షన్‌కు వెళ్లినట్టు మంత్రి వివరణ ఇచ్చారు. ఐతే తాను మాత్రం రోజాలా జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు వెళ్లలేదని ఎద్దేవా చేసిన ఆయన రోజాలా తాను నగరి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రలు కూడా చేయలేనని అంటూ విమర్శించారు. ఆ తర్వాత పొన్నూరు తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ... గతంలో కాంగ్రెస్ పాలనలో ఆయేషామీరాను ఆ పార్టీకి చెందిన నాయకుల బంధువులే హత్య చేసినట్లు ఆమె తల్లిదండ్రులే స్వయంగా చెప్పారన్నారు. అంతేకాకుండా ఆ విద్యార్థిని వీడియోలు కూడా తీసినట్టు ఆమె తల్లిదండ్రులు విలపించినప్పుడు రోజా ఏం చేశారంటూ మండిపడ్డారు.